ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు గూడ్స్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో వ్యాగన్లు పట్టాలు తప్పాయి. కొన్ని పట్టాలపైన, మరికొన్ని పట్టాల పక్కన పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు రైళ్ల డ్రైవర్స్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత లక్నో-వారణాసి, అయోధ్య-ప్రయాగ్‌రాజ్ రైల్వే ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

ప్రస్తుతం ఘటన స్థలంలో పట్టాలపై నుంచి వ్యాగన్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. రైల్వే ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ను క్లియర్ చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్ల ఇంజన్లు దెబ్బతిన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.