తమ పెళ్లికి ఎవ్వరూ ఒప్పుకోరు అంటూ.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటకలో కలకలం రేపింది. ఇందులో ఒకరు చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు.
బెంగళూరు : ఇద్దరు కాలేజీ విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు బెంగళూరులో కలకలం రేపుతోంది. కాలేజీ అయిపోయాక తిరిగి ఇంటికి బయలుదేరిన ఇద్దరు విద్యార్థినులు కాలువలోకి దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా ముగళూరు గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని బెంగళూరు రూరల్ జిల్లా హొసకోట తాలూకా బాగూరు గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె ఆర్. రాజేశ్వరి (17)గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థిని సుప్రియ (17)గా గుర్తించారు. ఆలూరు తాలుక కోడూరు గ్రామ పంచాయతీకి చెందిన మునియప్ప, లక్ష్మమ్మల కుమార్తె సుప్రియా. ఆమె కోసం గాలిస్తున్నారు.
సుప్రియ, రాజేశ్వరిలు చదువులో చాలా ప్రతిభావంతులు. మంగళవారం ఉదయం ఎప్పటి లాగే కళాశాలకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకు కాలేజీ నుంచి ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ తాలూకా ముగళూరు సమీపంలో ప్రవహించే దక్షిణ పినాకిని నది కాలువ వద్దకు వెళ్లారు. సమీపంలోని బేకరిలో తినుబండారాలు కొన్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా కాలువలోకి దూకేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అనుగొండనహళ్లి ఎస్ఐ సంగమేష్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి గాలించగా రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది.
మధ్యప్రదేశ్లో దారుణం: చెట్టుకు వేలాడుతూ కనిపించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... హత్యా, ఆత్మహత్యా
మంగళవారం రాత్రి 9 గంటల వరకు గాలింపు జరిపినా సుప్రియ ఆచూకీ కనిపించలేదు తిరిగి బుధవారం అంతా గాలించినా జాడ తెలియలేదు. ఈ ఘటన కలకలం రేపడంతో స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చదువుల్లో బాగా ఉండే వీరిద్దరూ.. ఒకేసారి కలిసి చనిపోవాలనుకోవడం, కాలువలోకి దూకడానికి దారితీసిన పరిస్థితులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, ‘మన పెళ్లికి ఎవరూ అంగీకరించేది లేదు, నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు’ అని సుప్రియ రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటనా స్థలంలో లభించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయనున్నారు.
