Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ సరిహద్దులో మందుపాతర పేలి లెఫ్టినెంట్ అధికారి, జవాను దుర్మరణం

జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆదివారం ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, మరో జవాను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
 

two army soldiers killed in landmine blas near LOC border in jammu kashmir
Author
Poonch, First Published Oct 31, 2021, 12:48 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఉగ్రవాదం, పేలుడు, కాల్పులతో దద్దరిల్లుతున్నది. కొన్ని వారాలుగా ఉగ్రవాద చర్యలు భారీగా పెరిగాయి. Jammu Kashmirలో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి Army బలగాలు పటిష్ట పహారా కాస్తున్నాయి. Pakistan సరిహద్దు నుంచి అక్రమ చొరబాట్లను తిప్పికొట్టడానికి గస్తీ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ మందుపాతర పేలి ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ఒక జవాను దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

జమ్ము కశ్మీర్ జిల్లా రజౌరీ పరిధిలోని Naushera సెక్టార్‌లో ఆర్మీ కౌంటర్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది. పూంచ్ సెక్టార్‌లోని అటవీ ప్రాంతంలో కనీసం మూడు వారాలుగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ జరుగుతున్నది. ఈ ఏరియాలో Terrorists తలదాచుకున్నారన్న సమాచారంతో పెద్దఎత్తున బలగాలు ఆపరేషన్ చేపడుతున్నాయి. అడవిలోపలికి వెళ్లి ఉగ్రవాదుల అంతు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య కాల్పులు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.

ఈ ఏరియాకు సమీపంలోనే LOC దగ్గర సెక్టార్ నౌషెరా ప్రాంతంలో అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టడానికి ఆర్మీ బలగాలు పెట్రోలింగ్ చేశాయి. ఈ డ్యూటీ చేస్తుండగానే ఓ Landmine పేలింది. ఈ పేలుడులో ఆర్మీ లెఫ్టినెంట్ రిషికుమార్, జవాను మంజిత్ సింగ్‌ సహా పలువురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీప ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి ఆర్మీ లెఫ్టినెంట్ రిషికుమార్, జవాను మంజిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరొకరికి చికిత్స అందుతున్నదని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.

Also Read: జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు, రాష్ట్రహోదాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశంతో నిర్వహించిన పెట్రోలింగ్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించిందని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. సరిహద్దు గుండా ఉగ్రవాదుల అక్రమంగా చొరబడకుండా అడ్డుకోవడానికి ఆ ఏరియాలో ఆర్మీ ల్యాండ్ మైన్‌లు అమర్చిందని పేర్కొన్నారు.

దేశ భద్రత కోసం విధులు నిర్వహిస్తూ లెఫ్టినెంట్ రిషి కుమార్, జవాను మంజిత్ సింగ్‌లు ప్రాణాలను త్యాగం చేశారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. అమరుడు లెఫ్టినెంట్ రిషికుమార్ బిహార్‌లోని బెంగుసరాయ్‌కి చెందినవారని, అమరుడు మంజిత్ సింగ్ పంజాబ్ భటిండా జిల్లా సిర్వెవాలాకు చెందినవారని వివరించారు. వారు సమర్పించిన ప్రాణత్యాగాన్ని ఆర్మీ, భారత దేశం నిత్యం స్మరించుకుంటుందని తెలిపారు.

జమ్ము కశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉన్నతాధికారులతో ఇటీవలి పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. అనంతరం జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్రహోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ లేదా లోక్ సభ నియోజకవర్గాలకు సరిహద్దులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టాలని యోచించింది. ఇందుకోసం సంబంధిత అధికారులకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ, జమ్ము కశ్మీర్‌లోని పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. ముందు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నాయి. తాజాగా, అమిత్ షా ఈ అంశంపై మాట్లాడారు.

Follow Us:
Download App:
  • android
  • ios