ట్విట్టర్(Twitter) సేవలకు సోమవారం అంతరాయం కలిగింది.  ట్విట్టర్ లో లింక్‌లు,లాగిన్‌లను తెరవడంలో సమస్యల గురించి నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక లోపం ఎదుర్కొన్నట్లు నివేదించబడింది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, రాత్రి 10 గంటల వరకు భారతీయ వినియోగదారుల నుండి 1093 ఫిర్యాదులు అందాయి.

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.ట్విట్టర్ నుండి ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను యాక్సెస్ చేయడంలో సమస్యలను యూజర్లు ఎదుర్కొంటున్నారు. సోమవారం నాడు లింక్స్ ఓపెన్ కావడం లేదని నెటిజన్లు అంటున్నారు. కొందరు లాగిన్ కాలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు. మరికొందరు చిత్రం లోడ్ కావడం లేదని ఫిర్యాదు చేశారు. అమెరికా,యూకే , ఇతర దేశాల నుండి వేలాది ఫిర్యాదులు అందాయి.

వేలాది ఫిర్యాదులు

డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. రాత్రి 10 గంటల వరకు భారతీయ వినియోగదారుల నుండి 1,093 ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌లోని వినియోగదారుల నుండి ట్విట్టర్‌తో సమస్యల గురించి 8,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఇంటర్నెట్ యాక్సెస్ వాచ్‌డాగ్ నెట్‌బ్లాక్స్ మాట్లాడుతూ.. "ట్విట్టర్ ప్రస్తుతం చాలా మంది వినియోగదారులను ప్రభావితం చేసే అంతర్జాతీయ మెల్ట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది." అని పేర్కొంది.


మరోవైపు,ట్విట్టర్‌ ప్లాట్ ఫాంలో త్వరలో మార్పులు రానున్నాయని సిఇఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. భవిష్యత్తులో ట్విట్టర్‌లో 10వేల అక్షరాలతో పోస్ట్‌ చేసేందుకు వీలుగా మార్పులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మైక్రో బ్లాగింగ్‌ పోస్టుల్లోని అక్షరాలను 4 వేలకు పొడిగిస్తూ గత నెలలోనే ట్విటర్‌ కంపెనీ వెల్లడించింది. అయితే ఈ అవకాశం బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఇతర యూజర్ల కూడా ట్వీట్లను చదివేందుకు, రీట్వీట్‌ చేసేందుకు కోట్‌ చేసే సదుపాయం మాత్రమే ఉంటుందని తెలిపారు. గతంలో ట్వీట్లకు 280 అక్షరాలకు మాత్రమే పరిమితి ఉంది. ఇదే తరుణంలోనిర్దిష్టమైన సమాచారం కోసం యూజర్లకు చార్జ్‌ చేసే అవకాశముందని కూడా మస్క్‌ తెలిపారు.