మహిళా కానిస్టేబుల్ మీద హత్యాయత్నం, న్యాయవాది జంట అరెస్ట్...
మహిళా కానిస్టేబుల్ మీదికి బండిని దూకించి.. ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యేలా చేసిన అడ్వకేట్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిమీద హత్యానేరాన్ని ఆరోపించారు.
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఓ అడ్వకేట్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ పోలీస్ అధికారి తెలిపారు.
వివరాల్లోకి వెడితే.. బ్రిజేష్ కుమార్ బొలోరియా (35) అనే న్యాయవాది ట్రాఫిక్ రూల్స్ ను తీవ్రంగా ఉల్లంఘించారు. దీంతో ఈ నేరం కింద అక్కడున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రజ్ఞా శిరామ్ దల్వీ (36) అతని మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు నల్లసోపరా పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ విలాస్ సూపే తెలిపారు. ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత దాన్ని వెహికిల్స్ గోడౌన్లో ఉంచారు.
ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం, నిందితుడిని గదిలో పెట్టి తాళం వేసిన బాధితురాలు..
బొలోరియా, అతని భార్య డాలీ కుమారి సింగ్ (32) సోమవారం గోడౌన్కు వచ్చారు. టూ వీలర్ ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న దాల్వీ వారిని గోడౌన్ ప్రవేశద్వారం వద్ద ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో, నిందితులు మోటర్బైక్పై పారిపోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెను బండితో ఢీ కొట్టారు. దీంతో మహిళా పోలీసు కింద పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
ఘటనా స్థలం నుంచి పారిపోతూ, నిందితులు కానిస్టేబుల్ దాల్వీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని తెలిపారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 307 (హత్యాయత్నం), 353 (ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి తప్పించేందుకు దాడి లేదా నేరపూరిత శక్తి), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 34 కింద కేసు నమోదు చేయబడిందని పోలీసులు చెప్పారు.