బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్య
రాజకీయ కక్షతోనే తమ పార్టీ నాయకుడిని చంపారని ఎంపీ చెప్పారు. గతంలో కొందరు తన తండ్రిని బెదిరించారని, బీజేపీ నాయకులే ముందస్తు కుట్ర పన్ని హత్య చేశారని మండల్ కుమారుడు అనూప్ మండల్ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని బక్చా సర్పంచ్ వాస్ దేవ్ మొండల్ గా గుర్తించారు. మొండల్ సోమవారం అర్థరాత్రి తన కుమార్తె ఇంటికి వెళ్తుండగా... ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
బాధితుడిని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. హతుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యా ఘటనతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లను మూసివేసి ఆందోళనకు దిగారు. తమ పార్టీ నాయకుడిని బీజేపీ వాళ్లే హత్య చేశారని టీఎంసీ ఎంపీ దిబయెందు అధికారి ఆరోపించారు.
రాజకీయ కక్షతోనే తమ పార్టీ నాయకుడిని చంపారని ఎంపీ చెప్పారు. గతంలో కొందరు తన తండ్రిని బెదిరించారని, బీజేపీ నాయకులే ముందస్తు కుట్ర పన్ని హత్య చేశారని మండల్ కుమారుడు అనూప్ మండల్ ఆరోపించారు. బసుదేవ్ మండల్ తల, కాళ్లు, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలతో మరణించారు. ఈ హత్య ఘటనతో టీఎంసీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కాగా...బెంగాల్లో గత వారం రోజులుగా పలు హత్యలు చోటుచేసుకున్నాయి. ఆదివారం నదియా జిల్లాలో 55 సంవత్సరాల స్ధానిక బీజేపీ నేత హరాల దేవ్నాధ్ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. గత వారం ముర్షిదాబాద్లో ఆరెస్సెస్ కార్యకర్త ప్రకాష్ పాల్ గర్భవతి అయిన ఆయన భార్య, ఆరేళ్ల కుమారుడిని దుండగులు హత్య చేసిన ఘటన కలకలం రేపింది.