స్నేహితులతో కలిసి తన ఇంట్లో ఉన్న ఊయలతో పదేళ్ల బాలుడు ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడికి ఊయలతాడు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక బాలుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
సోదరుడి కోసం ఏర్పాటు చేసిన ఊయల తాడు మెడకు చుట్టుకొని పదేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బరన్ జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బరన్ జిల్లాలోని చాబ్రా పట్టణంలో పదేళ్ల అదిల్ తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఆ బాలుడికి ఇటీవలే ఓ సోదరుడు జన్మించాడు. చిన్న కుమారుడి కోసం తల్లిదండ్రులు ఇంట్లో ఊయలను కట్టారు. అందులో బాలుడిని పడుకోబెట్టి, జోల పాడుతూ నిద్రపుచ్చేవారు.
అప్పుడప్పుడూ అదిల్ కూడా ఆ ఊయలతో ఆడుకునేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా తన స్నేహితులతో కలిసి ఊయలతో బాలుడు ఆడుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు తమ పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఊయలతో ఆడుకుంటున్న సమయంలో ఊయల తాడు ప్రమాదవశాత్తూ అదిల్ మెడకు చుట్టుకుంది.
దీంతో బాలుడికి ఊపిరాడలేదు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అదిల్ ను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాబ్రా పోలీసులు.. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.