ఛత్తీస్ఘడ్లో విషాదం: చెరువులో ట్రాక్టర్ బోల్తా,నలుగురి మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో చెరువులో పడి ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఆదీవాసీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
దంతెవాడ: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న చెరువులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ ఈ చెరువులో పడింది. ఈ ఘటనలో కోస మాడ్వి, దాసై కావసీ, దినేష్ మార్కం, పులే కావసీ లు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంకా 15 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు.
దంతెవాడ జిల్లాలోని తేతం గ్రామానికి చెందిన ఆదీవాసీలు కాటేకాల్యన్ లో జరిగిన ఆదీవాసీ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామానికి ట్రాక్టర్ పై వస్తున్న సమయంలో ట్రాక్టర్ పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ చెరువులో పడిందని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు.ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలోకి తరలించారు.