టీఎంసీ నుండి బీజేపీలో చేరిక: స్టేజీపైనే గుంజీలు తీసిన నేత
బీజేపీలో చేరిన టీఎంసీ నేత.... ఇంతకాలం పాటు తాను టీఎంసీలో ఉండి తప్పు చేశానని స్టేజీపైనే గుంజీలు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోల్కతా: బీజేపీలో చేరిన టీఎంసీ నేత.... ఇంతకాలం పాటు తాను టీఎంసీలో ఉండి తప్పు చేశానని స్టేజీపైనే గుంజీలు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని టీఎంసీ శక్తివంచనలేకుండా ప్రయత్నాలు చేస్తోంది.
సుశాంత్ పాల్ నే టీఎంసీ నేత గురువారం నాడు బీజేపీలో చేరాడు. టీఎంసీ నుండి బయటకు వచ్చిన సువేందు అధికారి , బీజేపీ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలుత తాను బీజేపీలో ఉన్నానని కానీ లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.
టీఎంసీలో ఉండి తాను తప్పు చేశానని ఆయన చెప్పారు. టీఎంసీ కార్యకర్తగా తనకు అంటుకొన్న పాపాలను ప్రక్షాళన కోసం తనకు తానే శిక్ష విధించుకొంటున్నట్టుగా చెప్పారు. స్టేజీపైనే ఆయన గుంజీలు తీశారు. పక్కనే ఉన్న నేతలు ఆయనను ఆపే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో టీఎంసీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారు.