కొడుకు, కూతురితో కలిసి అనుమానాస్పద స్థితిలో తల్లి మృతి.. బెంగళూరులో షాకింగ్ ఘటన..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నపోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నపోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతులను 70 ఏళ్ల యశోద, ఆమె కుమారుడు నరేష్ గుప్తా, కుమార్తె సుమనా గుప్తాగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో మృతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలిందని పోలీసులు చెప్పారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
యశోదకు ముగ్గురు పిల్లలకు కాగా.. ఒక కుమార్తెకు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కూతురు ఆమె భర్తతో కలిసి రాజాజీనగర్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యశోద తన పిల్లలు నరేష్, సుమనలతో కలిసి నివాసం ఉంటుంది. వీరికి ఇంకా పెళ్లిళ్లు కాలేదు. యశోద కుమార్తె సుమన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. యశోద భర్త కొంతకాలం క్రితం మరణించారు. వారు ప్రస్తుతం ఉన్న ఇంట్లోకి కొన్ని నెలల క్రితమే వచ్చినట్టుగా సమాచారం. నరేష్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు.
అయితే యశోద బంధువులు వారికి ఫోన్ చేయగా.. సమాధానం రాకపోవడంతో ఆమె మరో కుమార్తెకు సమాచారం అందించారు. దీంతో ఆమె యశోద నివాసం ఉంటున్న నివాసానికి వచ్చి చూసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఇక, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురూ విషం తాగి జీవితాలను ముగించుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.