మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన మహిళ మీద అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు ముగ్గురు వలసకూలీలు. తాగిన మైకంలో.. తమ నేరాన్ని పోలీసులకు చెబుతుందన్న భయంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
భోపాల్ : మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో 50 ఏళ్ల గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వలసకూలీలు ఆమె మీద గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆమె పోలీసుల దగ్గరికి వెడతానని బెదిరించింది. తాము పట్టుబడతామన్న భయంతో ఆమె మెడ విరగ్గొట్టి, హత్య చేశారు. హత్య విషయం వెలుగు చూడడంతో పంజాబ్కు చెందిన ఈ ముగ్గురు వలస కార్మికులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
భోపాల్కు 150 కిలోమీటర్ల దూరంలోని పిపారియా ప్రాంతంలోని ఒక గ్రామంలోని పొలంలో ఈ దారుణం జరిగింది. నిందితులు పంజాబ్లోని పాటియాలా జిల్లాకు చెందినవారు. వీరు యేటా తమ యజమానులతో పాటు స్థానిక రైతుల దగ్గర కాంట్రాక్టు పనులు చేయడానికి క్రమం తప్పకుండా ఈ ప్రాంతానికి వస్తుంటారని ఎస్పీ గురుకరణ్ సింగ్ ఆదివారం తెలిపారు. నిందితులు, బాధితురాలు ఇద్దరు అక్కడి పొలాల్లోనే చిన్న గుడిసెల్లో ఉంటారు.
జూన్ 22న ముగ్గురు నిందితులు మద్యం తాగి పార్టీ చేసుకుంటున్న సమయంలో ఆ మహిళ అటుగా వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనుమానితులైన జగ్మెల్ సింగ్ అలియాస్ రింకూ, హర్దీప్ సింగ్ ఆమెను మైదానంలోని ఒక మూలకు ఈడ్చుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఆ తరువాత మూడో నిందితుడు దర్శన్ సింగ్ కూడా తనపై బలవంతంగా అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆమె ఎదురు తిరిగింది. దర్శన్ సింగ్ ఆమెపై అత్యాచారం చేసి, పోలీసులకు చెబుతుందన్న భయంతో ఆమె మెడను విరిచేసి, చంపేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
మరుసటి రోజు ఉదయం ఒక రైతు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. విచారణలో, వారు నేరాన్ని అంగీకరించారు, అయితే తమ ఉద్దేశం మహిళను చంపడం కాదని పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించి జైలుకు తరలించారు. ముగ్గురు నిందితులపై సామూహిక అత్యాచారం, దర్శన్పై హత్య కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, అదిలాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తరువాత హత్య చేశారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. భర్త రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పేద కుటుంబం కావడం, భర్త మృతి.. ఒక్కగానొక్క కొడుకుని చూసుకోవాల్సి రావడంతో మతిస్థిమితం కోల్పోయిన ఆ మహిళ నిరాధారంగా మిగిలిపోయింది.
నిస్సహాయ స్థితిలో భిక్షాటన చేస్తోంది. కొడుకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుకున్నాడు. అతడిని వారి బంధువు ఒకరు ఆశ్రమ పాఠశాలలో చేర్చారు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న కుమారుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాడు. ఆమెకు భిక్షాటనతో రోజుకి రూ.50, రూ.100 వచ్చే డబ్బులతోనే వారి జీవనం కొనసాగుతోంది. అలాంటి మహిళ మీద కన్నేశారు ముగ్గురు కిరాతకులు. ఆమె అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, చంపేశారు.
అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అంతమొందించి వ్యవసాయ బావిలో పడేశారు. శనివారంనాడు ఆ మహిళ (38) మృతదేహం వ్యవసాయ బావిలో తేలుతూ కనిపించింది. ఆమె స్వగ్రామం నేరడిగొండ మండలం, చించోలి.
చించోలి నుంచి ధనోర(బి) గ్రామంలో ఉన్న తన సోదరీ ఇంటికి గత మంగళవారం వచ్చింది. తిరిగి తమ ఊరు వెళ్లేందుకు బస్టాండ్ కు వెళ్ళింది. అయితే, అప్పటికే చీకటి పడడంతో బస్టాండ్ లోనే పడుకుంది. ఇది గమనించిన ముగ్గురు యువకులు ఆమెతో మాటలు కలిపారు. మతిస్తిమితం సరిగా లేకపోవడంతో ఆమె వారి మాటలను నమ్మింది. ఆమెను వారు సమీపంలోని పొలాలలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు.
అఘాయిత్యం తర్వాత ఆమె గొంతునులుమి బావిలో పడేశారు. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలు పొలానికి పనులకు వెళ్లగా బావిలోనుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో వెళ్లి చూశారు. అక్కడ వారికి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి శవాన్ని వెలికి తీయించారు. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
