Lok Sabha Speaker Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరిట‌ నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు సైబర్ నేరగాళ్లు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు..  ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గత నెలలో, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేరిట కూడా న‌కిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి..ఆర్థిక సహాయం కోరుతూ వీఐపీలతో సహా వ్యక్తులకు సందేశాలు పంపారు. దీంతో ఆయన కార్యాలయం హోం మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేసింది.  

Lok Sabha Speaker Om Birla: రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగడాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. టెక్నాలజీని మంచి కంటే ఎక్కువగా.. చెడుకే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు అమాయకులను దారుణంగా మోసం చేస్తూ.. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవ‌ల‌ సెల‌బ్రెటీల పేర్ల‌ను, రాజ‌కీయ నేత పేర్ల‌తో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించి.. ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డుతున్నారు సైబర్ నేర‌గాళ్లు. 

తాజాగా..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరిట‌ నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు సైబర్ నేరగాళ్లు. ఆర్థిక సహాయం కోరుతూ వీఐపీలతో సహా వ్యక్తులకు సందేశాలు పంపారు. ఈ విషయం గుర్తించిన ఆయ‌న కార్యాల‌యం .. సంబంధిత అధికారులకు సమాచారం అందించామని బుధవారం వెల్లడించింది . 

ఈ విష‌యంలో పై లోకస‌భ స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. కొంతమంది దుర్మార్గులు ప్రొఫైల్ ఫోటోతో నా పేరు మీద నకిలీ (వాట్సాప్) ఖాతాను సృష్టించారు. ఎంపీలు, ఇతర రాజ‌కీయ నాయ‌కుల‌కు    7862092008, 9480918183 9439073870 నంబర్ల నుండి సందేశాలు పంపుతున్నారని లోక్‌సభ స్పీకర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాం. దయచేసి ఈ నంబర్‌ల నుండి వచ్చే కాల్‌లు/మెసేజ్‌లను విస్మరించండి లేదా నా కార్యాలయానికి తెలియజేయండి. అని కోరారు. 

ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు.. లోక్‌సభ స్పీకర్‌కు చెందిన నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన సైబర్ నేరగాళ్లతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ముందుగా ఉన్న సిమ్ కార్డులను ముఠాకు విక్రయించారని, ఓం బిర్లా ఫోటోను ఉపయోగించి నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారని, లోక్‌సభ వెబ్‌సైట్‌ నుంచి పలువురు ఎంపీల మొబైల్‌ నంబర్లను నేరగాళ్లు రాబట్టి ఓం బిర్లా నకిలీ వాట్సాప్ ఖాతా నుంచి డబ్బులు కావాలని సందేశాలు పంపారు. అయితే ఇతని ఎత్తుగడకు ఎంపీలు ఎవరైనా బలి అయ్యారా అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

గత నెలలో, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రూపంలో ఒక వ్యక్తి ఆర్థిక సహాయం కోరుతూ వీఐపీలతో సహా ప్రజలకు సందేశం పంపారు. దీంతో ఆయన కార్యాలయం హోంశాఖను అప్రమత్తం చేసింది. ఈ వ్యక్తి మొబైల్ నంబర్ 9439073183 నుండి వాట్సాప్ సందేశాలను పంపుతున్నాడని ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్ అధికారిక ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది. మరిన్ని నంబర్ల నుంచి ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది వీఐపీలకు ఇలాంటి వాట్సాప్ సందేశాలు పంపినట్లు ప్రకటనలో తెలిపారు.