ఓ వెయ్యేళ్ల దేవాలయం యేడాదికి ఒకసారి తెరుచుకుంటుంది. అదీ శివరాత్రి రోజు మాత్రమే దర్శనం జరుగుతుంది. మధ్య ప్రదేశ్ లోని ఆ దేవాలయం విశిష్టత ఏంటంటే..  

మధ్యప్రదేశ్ : మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లో ఉన్న ఓ ఆలయం శనివారం తెరుచుకోనుంది. ఈ ఆలయం ఏడాదికోసారి మాత్రమే తెరుస్తారు. ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు 48కి.మీ.ల దూరంలోని రాయ్ సెన్ జిల్లాలో ఉంది. ఇది సోమేశ్వరాలయం. ఏడాది పొడవునా ఈ ఆలయం మూసే ఉంటుంది. మహాశివరాత్రి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరవడం ప్రత్యేకత. ఈ ఆలయం 1000 అడుగుల ఎత్తైన కొండపైన ఉంటుంది. పదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు.

ఆ తర్వాత దేశాన్ని పాలించిన పలువురు ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1974లో ఈ ఆలయాన్ని సామాన్య భక్తుల కోసం తెరవాలని ఒక ఉద్యమం కూడా జరిగింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ ఈ సోమేశ్వరాలయం తాళం తీసి, ద్వారాలు తెరిచి శివరాత్రి రోజు ఒక్కరోజు మాత్రమే పూజలు నిర్వహించాలని అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది.

ఈశా మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గానంతో అలరించనున్న రామ్ మిరియాల, మంగ్లీ...

అప్పటినుంచి ఈ ఆలయం ప్రతిఏటా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు.. 12 గంటలపాటు మాత్రమే తెరుస్తారు. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు జరిగే శివరాత్రి వేడుకల కోసం ఈ ఆలయాన్ని తెరవనున్నారు. ఏడాదికోసారి మాత్రమే ఆలయ ద్వారాలు తెరుచుకుని ఉండడంతో భక్తులు ఈ ఆలయానికి పోటెత్తారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రసాదంగా కిచిడి, పండ్లను పంపిణీ చేస్తారు. ఈ యేడు ఐదు క్వింటాళ్ల కిచిడి, పండ్లను ప్రసాదంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు.