ఇటీవల అరెస్టుకు గురై, బెయిల్ పై బయటకు వచ్చిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. తనను కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని అన్నారు. ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేశారని ఆరోపించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ అస్సాం ప్రభుత్వం, పోలీసులపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ సోమవారం విరుచుకుపడ్డారు. ‘‘ నేను దీనిని 56-అంగుళాల పిరికితనం అని పిలుస్తాను. ఒక మహిళను ఉపయోగించి నన్ను తప్పుడు కేసులో ఇరికించాను. ప్రధానమంత్రి కార్యాలయం ఈ కుట్రలో పాలుపంచుకుంది’ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
22 పరీక్షా పత్రాల లీకేజీ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఇటీవల ముంద్రా పోర్టు నుంచి రూ.1.75 లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను రికవరీ చేయాలని, ఉనాలో దళితులపై, రాష్ట్రంలోని మైనారిటీలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న గుజరాత్ బంద్ కు దిగుతానని జిగ్నేష్ మేవాని ప్రకటించారు. తనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన అన్నారు. ‘‘ నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు అదే రోజు 2,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. ఇది నన్ను నాశనం చేయడానికి ముందస్తు ప్రణాళికాబద్ధమైన కుట్ర.’’ అని ఆరోపించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవానీ.. 2019 సెప్టెంబర్ లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ చేసిన ట్వీట్ల కారణంగా గుజరాత్ లోని పాలన్పూర్ పట్టణంలో అస్సాం పోలీసు బృందం గత నెలలో ఎమ్మెల్యే మెవానీని అరెస్టు చేసింది. అస్సాంలోని ఒక బీజేపీ నాయకుడు ఈ కేసును దాఖలు చేశారు. అయితే ఆ కేసులో ఆయన ఏప్రిల్ 25వ తేదీన బెయిల్ పొందాడు. మళ్లీ ఓ పోలీసు దాఖలు చేసిన దాడి కేసులో వెంటనే తిరిగి అరెస్టుకు గురయ్యాడు. అయితే దీనిపై కోర్టు మండిపడింది. కావాలనే దీనిని క్రియేట్ చేశారని పేర్కొంది. ఎట్టకేలకు అస్సాంలోని స్థానిక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అస్సాంలోని బార్పేట సెషన్స్ కోర్టు మేవానికి బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో జరిగిన ఘటనల క్రమాన్ని చిత్రీకరించేందుకు పోలీసుల వాహనాల్లో బాడీ కెమెరాలు ధరించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అస్సాం పోలీసులను ఆదేశించాలని ఆ సెషన్స్ కోర్టు గౌహతి హైకోర్టును కోరింది. కష్టపడి సంపాదించిన మన ప్రజాస్వామ్యాన్ని పోలీసు రాజ్యంగా మార్చడం ఊహించలేనిది అని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ చక్రవర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
