Bihar: దేశంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది ఓ ఘటన. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
communal harmony: దేశంలో గత కొన్ని రోజులుగా పలు చోట్ల హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది వ్యక్తులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యల వల్ల ఈ రెండు వర్గాల ప్రజల మధ్య వైరాన్ని పెంచుతూ దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి కుట్రలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీహార్ లో చోటుచేసుకున్న ఓ ఘటన దేశంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం జరిగిందంటే..
బీహార్లోని ఒక ముస్లిం కుటుంబం.. హిందూ వ్యక్తికి అంత్యక్రియలు చేసింది. ఇప్పుడు ఈ ఘటన మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తూ వైరల్ గా మారింది. ముస్లిం కుటుంబానికి చెందిన మొహమ్మద్ రిజ్వాన్ ఖాన్ స్వయంగా హిందు వ్యక్తి అయిన రామ్దేవ్ సా మృతదేహాన్ని తన భూజాలపై పెట్టుకుని అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రామ్దేవ్ సా పాట్నాలోని రిజ్వాన్ కు చెందిన హోజరీ అవుట్లెట్లో పని చేసేవారు. 25 ఏళ్లుగా ఆ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయనను ఆ ముస్లిం కుటుంబ వారు.. తన సొంత సభ్యుడిలా చూసుకున్నారు. 75 సంవత్సరాల వయస్సు ఉన్న రామ్దేవ్ సా గత వారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే రిజ్వాన్, అతని కుటుంబ సభ్యులు మృతునికి హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో చాలా మంది ముస్లిం పొరుగువారు కూడా ఉన్నారు.
రామ్దేవ్ సా.. రిజ్వాన్ దుకాణానికి రెండు దశాబ్దాల క్రితం వచ్చాడని స్థానికులు చెప్పారు. ఆయన జీవనం, సింప్లిసిటీకి అతను ముగ్ధుడయ్యాడని చెబుతున్నారు. "అతను మా నాన్నలాంటివాడు. ఉద్యోగం వెతుక్కుంటూ మా షాప్కి వచ్చినప్పుడు అతనికి దాదాపు 50 ఏళ్లు ఉండొచ్చు. నువ్వు బరువైన పని చేయలేవని చెప్పాను. అతను అకౌంటింగ్లో అనుభవం ఉందని రామ్దేవ్ సా నాతో చెప్పాడు. పూర్తి ఖాతా పుస్తకాలను నిర్వహించగలరు" అని రిజ్వాన్ చెప్పారు. ఆయన వయస్సు మీద పడటంతో విధులకు దూరంగా ఉండాలనీ, విశ్రాంతి తీసుకోమని అడిగినట్టు చెప్పారు. ఈ సమయంలో జీతం కూడా చెల్లిస్తాననీ, దేనికి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పినట్టు పేర్కొన్నారు. ఆయన తనకు ఒక సంరక్షకుడిలాంటివాడని రిజ్వాన్ అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మత ఘర్షణలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది మనుషుల అసలైన స్వభావం కాదని అన్నారు. "టెలివిజన్లో చూపబడుతున్నది సరైన చిత్రాన్ని చూపడం లేదు. ఒక పిల్లవాడు గాయపడినప్పుడు మేము అతని లేదా ఆమె మతాన్ని అడగము, మేము ప్రథమ చికిత్స అందిస్తాము. అదేవిధంగా, హిందువులు మా కార్యక్రమాలకు హాజరవుతారు. మేము వారి కార్యక్రమాలకు హాజరవుతాము" అని చెప్పారు.
