పాకిస్థాన్ భూభాగంలో భారతదేశానికి చెందిన క్షిపణి పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అణుశక్తి కలిగి ఉన్న బాధ్యతాయుతమైన దేశంగా భారత్‌కు మంచి పేరు ఉందని తెలిపారు. 

న్యూఢిల్లీ : ఈ నెల 9వ తేదీన భార‌త్ కు చెందిన క్షిప‌ణి అనుకోకుండా వెళ్లి పాకిస్థాన్ (pakistan) భూభాగంపై ప‌డింది. అయితే ఈ విష‌యంలో మంగ‌ళ‌వారం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (central defence minister rajnath singh) పార్ల‌మెంట్ లో ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌తో ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంతృప్తి చెందలేదు.

ఈ ఘ‌ట‌న‌పై రక్షణ మంత్రి చేసిన ప్రకటన ప్రజలకు ఏమీ తెలియ‌జేయ‌లేద‌ని బుధ‌వారం ఓవైసీ వ‌రుస ట్వీట్లు చేశారు. క్షిపణి ప్రమాదంపై పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించడంపై దృష్టి సారించాలని ప్ర‌ధాని మోడీ (Minister Narendra Modi)ని కోరారు. అణుశక్తి కలిగి ఉన్న బాధ్యతాయుతమైన దేశంగా భారత్‌కు ప్రపంచ ఖ్యాతి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వం కారణంగా దానిని నాశనం చేయడాన్ని అనుమతించలేమని ఆయన ట్వీట్ చేశారు.

‘‘ లాంచర్‌లో మరిన్ని క్షిపణులు ఉన్నాయనేది నిజమేనా ? మిగితా వాటిని టేకాఫ్ చేయ‌కుండా నిలిపివేయాలి. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఇలాంటి చర్యల పర్యవసానాలను మనం ఊహించ‌గ‌ల‌మా’’ అని ఓవైసీ అన్నారు. ‘‘ క్షిపణి తన నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుని ఉంటే అది ఆయుధాలను కలిగి ఉండేదని నివేదిక చెబుతోంది. అయితే నిర్దేశించిన లక్ష్యం ఏమిటి ’’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

పాక్ పై ప‌డిన క్షిప‌ణి ఘ‌ట‌న‌పై మంగ‌వారం లోక్ స‌భ (lok sabha)కు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివ‌ర‌ణ ఇస్తూ.. భారత క్షిపణి వ్యవస్థ చాలా నమ్మదగినదని, సుర‌క్షిత‌మైంద‌ని అన్నారు. భద్రతా విధానాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 9వ తేదీన క్షిపణి యూనిట్ సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తున్న సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుకోకుండా ఓ క్షిపణి విడుదలైందని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. క్షిపణి ఎలా ప్రయోగించబడిందనే విషయమై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఈ క్షిపణి పాక్ భూభాగంలో పడిందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా రాజ్ నాథ్ సింగ్ అభివ‌ర్ణించారు. ఈ క్షిపణి ప్రయోగంతో ఎలాంటి నష్టం జరగలేదని లోక్ స‌భ‌కు ర‌క్ష‌ణ శాఖ మంత్రి వివ‌రించారు. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంలో తమ సాయుధ బలగాలకు మంచి అనుభవం ఉందని ఆయ‌న తెలిపారు. 

అయితే లోక్ స‌భ‌లో రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్ర‌క‌ట‌నపై పాకి స్థాన్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. భార‌త ప్ర‌భుత్వం చెప్పిన వివ‌ర‌ణ త‌మ‌కు సంతృప్తి ఇవ్వ‌లేద‌ని చెప్పింది. ఈ క్షిప‌ణి ఘ‌ట‌న‌పై జాయింట్ ఎంక్వేరి వేయాల‌ని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ (Pakistan Foreign Ministry) శాఖ తెలియ‌జేసింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ (Mahmood Qureshi)మాట్లాడుతూ.. ‘‘ భారత రక్షణ మంత్రి లోక్‌సభలో చెప్పింది అసంపూర్ణమైనది. ఇది స‌రిపోదు. పాకిస్థాన్‌ను సంతృప్తి పరచడానికి ఇది సరిపోదు. నేను దీనిని తిరస్కరిస్తున్నాను. ఉమ్మడి విచారణకు డిమాండ్ చేస్తున్నాను ’’ అని ఆయ‌న తెలియ‌జేశారు.