Assembly Elections : ఎన్నికలు జరగాల్సి  ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించడం,  కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశం కానున్న‌ది. 

Assembly Elections : వ‌చ్చే నెల నుంచి దేశంలోని 5 ప్ర‌ధాన రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే, క‌రోనా కేసులు, థ‌ర్డ్ వేవ్ దృష్ట్యా స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీల‌కు జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే.. నేడు తో ఆ గ‌డువు పూర్తి కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా భౌతిక ర్యాలీలు, రోడ్‌షోల నిషేధం కొనసాగించాలా? లేదా ? విష‌యంపై భారత ఎన్నికల సంఘం సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర నేడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌తో భేటీ కానున్నారు. అలాగే ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో కూడా ఈసీ వర్చువల్‌గా సమావేశం కానున్న‌ది. ఈ స‌మావేశం చాలా కీల‌క కానున్న‌ది. దీంతో ఎన్నికల ప్రచార ర్యాలీలపై ఈసీ తీసుకోబోయే నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. 

దేశంలో COVID-19 కేసుల పెరుగుదల దృష్టిలో పెట్టుకుని.. భారత ఎన్నికల సంఘం జనవరి 8 నుంచి ఉత్తర ప్రదేశ్‌తో సహా ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించింది. కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా పెట్టుకుని..తొలుత జనవరి 15 వరకు బహిరంగ ర్యాలీలు, రోడ్ షో లపై నిషేధం విధించింది. ఆ త‌రువాత జనవరి 22న భౌతిక ర్యాలీలు రోడ్‌షోలపై నిషేధాన్ని విధించింది. ఆ త‌రువాత కోవిడ్ కేసుల మ‌రింత తీవ్రం కావ‌డంతో జనవరి 31 వరకు బహిరంగ ర్యాలీలు, రోడ్ షో లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలను పొడిగించిన సంగతి తెలిసిందే.


గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య జరుగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అయితే.. క‌రోనా ఆంక్షాల‌ను కాస్త ఎత్తివేస్తూ.. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేందుకు కమిషన్ 5 నుంచి 10 మందికి పెంచింది . మొదటి దశ అభ్యర్థులకు జనవరి 28 నుంచి, రెండో దశ అభ్యర్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఈ సడలింపు వర్తిస్తుంది.

 సాధారణ కరోనా పరిమితులతో వీడియో వ్యాన్‌ల ద్వారా ప్రచారాన్ని కూడా ఎన్నికల సంఘం అనుమతించింది. ఇందులో, బహిరంగ స్థలం సామర్థ్యం ప్రకారం.. SDMA నిర్ణయించిన పరిమితి ప్రకారం గరిష్టంగా 500 మంది లేదా 50 శాతం మంది పాల్గొనవచ్చు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సరైన ప్రవర్తన, మార్గదర్శకాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌తో పాటు ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని.. నామినీలను గుర్తించి వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని తెలిపింది.