శ్రీనగర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పోలీసును కాల్చి చంపి.. కుమార్తె పై కూడా కాల్పులు..
శ్రీనగర్ లో దారుణం జరిగింది. ఉగ్రవాదులు ఓ పోలీసు కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారు. అతడి కుమార్తెపై కూడా కాల్పులు జరిపారు. ఆ చిన్నారి ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
శ్రీనగర్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తరచూ విధ్వంసకర ఘటనలకు పాల్పడుతున్న ఉగ్రమూక తాజాగా ఓ పోలీసు కానిస్టేబుల్ ను అతడి ఇంటి సమీపంలో విచక్షణారహితంగా కాల్చి చంపారు. తరువాత అతడి ఏడేళ్ల కూతురుపై కూడా కాల్పులు జరిపారు. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
శ్రీనగర్ జిల్లా శివార్లలోని సౌరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీ తన ఏడేళ్ల కుమార్తె ను ట్యూషన్ సెంటర్ వద్దకు వదలివెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. రెండు వందల దూరం వెళ్లే సరికి ఉగ్రమూక దాడికి పాల్పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుమార్తె చేతికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి.
భార్య కోసం రూ. 90 వేలతో బైక్ కొన్న బిచ్చగాడు.. సంపాదన ఎంతో తెలిస్తే...
వెంటనే ఖాద్రీ, అతడి ఏడేళ్ల కుమార్తెను సమీపంలోని SKIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. అయితే కూతురుకు ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. ఆమె చికిత్స పొందుతోంది. కానిస్టేబుల్ హత్య పట్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్ రేంజ్) విజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను సమీప ప్రాంతాలకు పంపించారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీ ఈ నెలలో కాశ్మీర్లో హత్యకు గురైన మూడో పోలీసు. అంతకు ముందు మే 7వ తేదీన అంచర్ ప్రాంతానికి సమీపంలోని ఐవా బ్రిడ్జి వద్ద ఉగ్రవాదులు ఒక పోలీసును కాల్చిచంపగా, మే 13న పుల్వామా జిల్లాలో మరో పోలీసును కాల్చిచంపారు.
ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ మాలిక్ సాహిబ్ సౌరాకు చెందిన మోహ్ సయ్యద్ ఖాద్రీ కుమారుడు సైఫుల్లాగ్ ఖాద్రీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా బలగాలు చుట్టుముట్టాయి. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని LeT TRF కు చెందిన ఒక శాఖ సోషల్ మీడియాలో తెలిపింది. ఇలాంటి దాడులు కొనసాగుతాయని పేర్కొంది.
కాగా.. 13 రోజుల కిందట ద్గామ్ ప్రాంతంలోని చదురాలోని తహసీల్ ఆఫీసులో కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పటికీ, భద్రతా బలగాలు టార్గెట్ హత్యల చక్రాన్ని విచ్ఛిన్నం చేయలేకపోతున్నాయి. గత మూడు రోజుల్లో పోలీసులు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల నుండి ఐదుగురు యాక్టివ్ టెర్రరిస్టులను, 8 మంది టెర్రరిస్టు సహచరులను అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు 18 సైలెన్సర్ ఎనేబుల్ పిస్టల్లను, 4 వందలకు పైగా బుల్లెట్లు, అనేక ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
‘‘ ఉగ్రవాదులు తమ కార్య నిర్వహణ పద్ధతిని మార్చుకున్నారు. భద్రతా సంస్థలు లేదా బంకర్లపై దాడులకు బదులుగా చిన్న ఆయుధాలతో కొందరిని టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.’’ అని పోలీసు కార్యాలయం తెలిపింది. ఇది పెద్ద సవాల్గా మారిందని అన్నారు. భద్రతా బలగాలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 130 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయమే ఇప్పుడు ఉగ్రవాదులు కొత్త పద్ధతికి మారినట్లు సూచిస్తోంది.