Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ భూభాగాలు భారత్ లోకి : జమ్ము కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ ...

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సభలో ప్రసంగిస్తూ పాకిస్తాన్ తో పాటు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  

Terrorism and Indus water flow cant go together says UP CM Yogi Adityanath in JK election campaign AKP
Author
First Published Sep 28, 2024, 12:58 PM IST | Last Updated Sep 28, 2024, 12:58 PM IST

జమ్మూ కాశ్మీర్: 'సింధు లేనిదే హిందూస్తాన్ లేదు, రావి, చీనాబ్ లేనిదే పంజాబ్ లేదు'' అని తాము చిన్నతనంలో పాటలు పాడుకునేవాళ్లమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1960 సింధు జలాల ఒప్పందం సమీక్ష సందర్భంగా భారత ప్రభుత్వం 'నీరు, ఉగ్రవాదం కలిసి ప్రవహించవు' అని పాకిస్థాన్ కు స్పష్టం చేసిందన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరంగా మారి పాలనను విస్మరించింది... అందుకే ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి దారుణంగా వుందన్నారు యోగి. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రెండో రోజు జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం చేపట్టారు. రామ్‌నగర్ అభ్యర్థి సునీల్ భరద్వాజ్, ఉధంపూర్ తూర్పు అభ్యర్థి రాణ్‌వీర్ సింగ్ పఠానియా, కథువా అభ్యర్థి భారత్ భూషణ్, కిష్త్వార్ అభ్యర్థి షగున్ పరిహార్‌లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం యోగిని చూడటానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి రెండు సభల్లోనూ భారీగా జనం తరలివచ్చారు.

Terrorism and Indus water flow cant go together says UP CM Yogi Adityanath in JK election campaign AKP

ఇండియాలో వుంటామంటున్న పివోకే ప్రజలు : యోగి ఆదిత్యనాథ్

పాకిస్తాన్ నేడు రెండు కారణాల వల్ల ఇబ్బందుల్లో ఉందని సీఎం యోగి అన్నారు. మొదటిది అది తన కర్మల ఫలాన్ని అనుభవిస్తోంది. బలూచిస్తాన్ ప్రజలు మమ్మల్ని పాకిస్తాన్‌లో ఉండనివ్వరని... ప్రభుత్వం తమను విదేశీయులుగా పరిగణిస్తోందని చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా ఇప్పుడు తమకు పాకిస్తాన్ పాలన అవసరం లేదని చెబుతోంది. ఆకలితో చనిపోవడం కంటే జమ్మూ-కశ్మీర్‌లో భాగంగా మారి అఖండ భారత కలను సాకారం చేయడంలో భాగస్వాములు కావడం మేలని అంటున్నారు.

పాకిస్తాన్ ఆశ్రయంతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఖననం చేయడానికి రెండు గజాల స్థలం కూడా దొరకదని సీఎం హెచ్చరించారు. పాకిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్ లో హింసకు ప్రయత్నిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. భవిష్యత్ లో పాకిస్తాన్ జాడ లేకుండా పోతుందని యోగి హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ లాగే జమ్మూ-కశ్మీర్ కూడా అభివృద్ధికి అర్హమైనది : యోగి ఆదిత్యనాథ్

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ బలం ఉత్తరప్రదేశ్‌లో కనిపిస్తుందని... అక్కడ 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలోని రామజన్మభూమిలో రామ మందిరం నిర్మితమైందని సీఎం యోగి అన్నారు. రామ మందిరం నిర్మిస్తే రక్తపు నదులు ప్రవహిస్తాయని కొందరు అన్నారని, కానీ కొత్త భారతదేశంలో రక్తపు నదులు ప్రవహించవని, తనను తాను రక్షించుకోవడం ఎలాగో దానికి తెలుసని అన్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్‌లో ఒక్క అల్లరి కూడా జరగలేదని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ లాగే జమ్మూ-కశ్మీర్ కూడా అభివృద్ధికి అర్హమైనదని అన్నారు.

Terrorism and Indus water flow cant go together says UP CM Yogi Adityanath in JK election campaign AKP

భూలోక స్వర్గం జమ్మూ కాశ్మీర్ ను మత విద్వేషానికి గురిచేశారు

కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు భూలోక స్వర్గాన్ని మత విద్వేషాలకు గురిచేసి ప్రజలను దోచుకున్నాయని సీఎం యోగి ఆరోపించారు. ఈ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, అవినీతిని ప్రోత్సహించాయని ... కానీ ఇప్పుడు 370, 35A రద్దుతో జమ్మూ-కశ్మీర్‌లో అభివృద్ధి వేగంగా పెరిగిందని అన్నారు. గతంలో ఉగ్రవాద రాష్ట్రం కాస్త ఇప్పుడు పర్యాటక రాష్ట్రంగా మారిందని అన్నారు.

జమ్మూ-కశ్మీర్‌లో దేశంలోనే అతిపెద్ద, ఎత్తైన వంతెన నిర్మాణంలో ఉందని, వందే భారత్ వంటి ప్రపంచ స్థాయి రైలు కూడా జమ్మూ నుండి ఢిల్లీ వరకు ప్రారంభమైందని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీలు యువతకు తుపాకులు ఇచ్చాయని, కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ట్యాబ్లెట్‌లు ఇచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తోందని అన్నారు.

కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మళ్లీ ఉగ్రవాద శకం తీసుకురావాలని చూస్తున్నాయి : యోగి

మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 370ని తిరిగి తీసుకువస్తామని చెప్పేవారు మళ్లీ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు, అవినీతి యుగాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారని సీఎం యోగి అన్నారు. వారికి శాంతి, సామరస్యం, అభివృద్ధి కాదు, అధికారమే కావాలి... కానీ ఈ మూడు పార్టీలకు ఇక్కడ స్థానం లేదని అన్నారు. ఈ పార్టీలను తరిమికొట్టాలని ప్రజలు నిశ్చయించుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నాయకులు 12 నెలల్లో 8 నెలలు యూరప్, ఇంగ్లాండ్‌లలో, మూడు నెలలు ఢిల్లీలో గడిపేవారని, ఒక్క నెలలో జమ్మూ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

Terrorism and Indus water flow cant go together says UP CM Yogi Adityanath in JK election campaign AKP

ఈ పార్టీలు అరాచకత్వం, అవినీతి, కుటుంబ పాలన, ఉగ్రవాదాన్ని పెంచిపోషించాయి

కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఇక్కడ అరాచకత్వం, అవినీతి, కుటుంబ పాలన, ఉగ్రవాదాన్ని పెంచిపోషించాయని సీఎం యోగి ఆరోపించారు. బకర్వాల్, గుజ్జర్, దళిత్, వాల్మీకి వర్గాల ప్రజల హక్కులను హరించాయని ఆరోపించారు. బీజేపీ ప్రధాని మోడీ నాయకత్వంలో వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 80 కోట్ల మందికి భారతదేశంలో ఉచితంగా రేషన్ అందుతోందని, అదే సమయంలో పాకిస్తాన్ బిక్షాపాత్ర చేతబట్టుకుని తిరుగుతోందని అన్నారు.

కాంగ్రెస్ పరిస్థితులను మార్చలేదు, మరింత దిగజార్చింది

కాంగ్రెస్ పార్టీ 'హస్తం పరిస్థితులన్నింటిని మారుస్తుంది' అని చెబుతుందని, కానీ ఆ 'హస్తం' పరిస్థితులను మరింత దిగజార్చిందని సీఎం యోగి అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భద్రత, అభివృద్ధి పొందాలని, అటల్ జీ కల అయిన అఖండ భారతాన్ని సాకారం చేయాలని కోరారు.

Terrorism and Indus water flow cant go together says UP CM Yogi Adityanath in JK election campaign AKP

ఆర్టికల్ 370 పాపాలకు కాంగ్రెస్ మూలం

1952లో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ భావాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన ప్రజాస్వామ్య నిరసన చేపట్టారని గుర్తుచేసారు. కానీ ఆయనను చిత్రహింసలు పెట్టారని సీఎం యోగి అన్నారు. ఇక్కడి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఆర్టికల్ 370 అనేది కాంగ్రెస్ పాపాలకు ప్రతీక అని సీఎం యోగి అన్నారు.

జమ్మూ-కశ్మీర్ విభజన విషాదాన్ని, ఉగ్రవాదాన్ని, వలసలను చవిచూసిందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని అన్నారు. బీజేపీ, జనసంఘ్‌కు చెందిన ప్రతి కార్యకర్త 'శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసిన కశ్మీర్ మనది' అని నినాదాలు చేసేవారని గుర్తు చేశారు. 370 రద్దుతో జమ్మూ-కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. నేడు ఇక్కడ సామూహిక హత్యలు జరగడం లేదని, జి-20 సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి చేతికి పని, ప్రతి పొలానికి నీటిని పొందుతోందని అన్నారు.

అన్ని సభల్లోనూ కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ డాక్టర్ జితేంద్ర సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios