మధ్యప్రదేశ్‌లో ఓ 19 ఏళ్ల యువకుడు రాత్రి పూట సంచరిస్తూ పడుకుని ఉన్న సెక్యూరిటీ గార్డుల వరుస హత్యలు చేశాడు. నలుగురిని పొట్టనబెట్టుకున్న తర్వాత పోలీసులకు చిక్కాడు. ఈ హత్య లను అంగీకరించిన ఆ యువకుడు తాను ఫేమస్ కావడానికే ఈ నేరాలు చేసినట్టు చెప్పాడు. కేజీఎప్ 2 సినిమా తనకు ఇన్‌స్పిరేషన్ అని పేర్కొనడం గమనార్హం. 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో వరుస హత్యల చిక్కుముడిని పోలీసులు విప్పారు. సాగర్ జిల్లాలో సెక్యూరిటీ గార్డుల హత్యల వెనుక కోణం వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ సీరియల్ కిల్లర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉదయం 3.30 గంటలకల్లా ఆయనను పట్టుకునే లోపు భోపాల్‌లో మరో హత్యకు పాల్పడ్డాడు. గడిచిన ఐదు రోజుల్లో నలుగురిని హతమార్చినట్టు నిందితుడు అంగీకరించినట్టు పోలీసులు వివరించారు. ఈ హత్యలన్నీ తాన ఫేమస్ కావడానికి చేసినవేనని చెప్పాడు. తాను కేజీఎఫ్ 2 సినిమా
ద్వారా ఇన్‌స్పైర్ అయ్యాడని పోలీసులు విచారణలో వెల్లడించాడు. ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని, రాకీ బాయ్ తరహాలోనే భవిష్యత్‌లో పోలీసులను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం గమనార్హం.

సాగర్ జిల్లా కేస్లీ ఏరియాకు చెందిన 19 ఏళ్ల శివప్రసాద్ ధూర్వేగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి లాల్‌ఘాటి ఏరియాలో మార్బుల్ స్టాకిస్ట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు.

మొబైల్ నెట్‌వర్క్ సహాయంతో పోలీసులు శివప్రసాద్ ధూర్వేను అరెస్టు చేసిన తర్వాత మర్డర్‌ల గురించి ప్రశ్నించగా.. నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా వాటిని అంగీకరించాడు. భోపాల్‌లో సెక్యూరిటీ గార్డును తానే చంపేసినట్టు ఒప్పుకున్నాడు. గతంలో సాగర్ జిల్లాలో హత్యకు గురైన సెక్యూరిటీ గార్డుకు చెందిన ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. 

Scroll to load tweet…

సాగర్ జిల్లాలో శివ ప్రసాద్ ధూర్వే హత్య చేసిన మూడో వ్యక్తి మంగల్ ఆహిర్వార్. ఆయన తల కు తీవ్రమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోవడానికి ముందు ఆయన చెప్పిన కొన్ని సూచనలతో పోలీసులు ఓ స్కెచ్ గీశారు. ఆ స్కెచ్‌ను రిలీజ్ చేసి శివప్రసాద్ ధూర్వే గురించి ఏ సమాచారం ఇచ్చిన రూ. 30వేల బహుమతిని ప్రకటించారు.

శివప్రసాద్ ధూర్వే రాత్రి పూట పడుకుని ఉన్న గార్డులను హత్య చేసేవాడు. 50 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఉత్తమ్ రజక్, కళ్యాణ్ లోడి, షాంబురమ్ దూబేలను చంపేశాడు.