రైతులకు తమిళనాడు ప్రభుత్వ భారీ రుణ మాఫీ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట ఇచ్చింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ.. శుభవార్త తెలియజేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
సహకార బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న సుమారు రూ .12,110 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్నపంటలకు 1,117 కోట్ల రూపాయల పరిహారాన్ని సీఎం ఇంతకుముందు ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది లబ్ధి పొందారు. తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా పంట నష్టానికి దారితీసింది. గతేడాది సాధారణ స్థాయిలతో పోలిస్తే రాష్ట్రంలో 708శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంటకోత దశలో ఉన్న కురిపిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.