నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషన్లు.. రేపు సుప్రీం కోర్టులో విచారణ..
నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రేపు ఈ పిటిషన్లను విచారించనుంది.
నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రేపు ఈ పిటిషన్లను విచారించనుంది. వివరణాత్మక విచారణ తేదీని ధర్మాసనం నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, ఈ అంశాన్ని 2016 డిసెంబరు 16న రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. అయితే అప్పటి నుంచి బెంచ్ ఏర్పాటు చేయబడలేదు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది.
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టుగా.. 2016 నవంబరు 8వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది. బ్లాక్ మనీ నిర్మూలన, దొంగనోట్లకు అడ్డుకట్ట వేయడం, ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అరికట్టడం లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా మోదీ సర్కార్ తెలిపింది. ఆకస్మాత్తుగా నోట్ల రద్దు ప్రకటన వెలువడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని వారాల పాటు దేశంలోని బ్యాంకుల, ఏటీఎంల ముందు పెద్ద ఎత్తున క్యూలైన్లు దర్శనమిచ్చాయి. నగదు మార్పిడి పరిమితి విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.
మోదీ ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలువురు ఆర్థికవేత్తలు తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక, పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా రూ. 500, రూ. 2000, రూ. 200 నోట్లను విడుదల చేసింది.