స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో గురువారం  విచారణ జరిగింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత కొద్ది రోజుల నుంచి ఈ కేసులో వాదనలు వింటోంది. ఈరోజు విచారణ సందర్బంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యేక వివాహ చట్టం కేవలం వ్యతిరేక లింగానికి చెందిన వారికి మాత్రమేనని అన్నారు. ఇది వివిధ మతాల వారి కోసం తీసుకురాబడిందని చెప్పారు. ప్రతి ప్రైవేట్ సంబంధాన్ని గుర్తించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండదని పేర్కొన్ానరు. 

స్వలింగ సంపర్కుల వివాహంలో భార్య ఎవరు అవుతారని, ఎవరికి భరణం హక్కు లభిస్తుందని ప్రశ్నించారు. గే లేదా లెస్బియన్ వివాహంలో ఎవరిని భార్య అని పిలుస్తారని అడిగారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కుల వివాహానికి కూడా వర్తింపజేయాలని సూచిస్తున్నట్లయితే భర్త కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని అన్నారు. అయితే వ్యతిరేక లింగ వివాహాలకు ఇది వర్తించదని చెప్పారు.

ఇక, స్వలింగ జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తెరవడం, బీమా పాలసీలలో భాగస్వామిని నామినేట్ చేయడం వంటి ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. స్వలింగ జంటలకు మంజూరు చేసే సామాజిక ప్రయోజనాలపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. స్వలింగ జంటలు వారి వైవాహిక స్థితికి చట్టపరమైన గుర్తింపు లేకుండా కూడా మంజూరు చేయగల సామాజిక ప్రయోజనాలపై ప్రతిస్పందనను మే 3వ తేదీలోగా తెలియజేయాలని తెలిపింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.