Sidhu Moose Wala: పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్య తర్వాత అతని తండ్రి ఏదైనా రాజకీయ పార్టీలో చేరవచ్చు, ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఈ వదంతులను సిద్ధూ మూసేవాలా తండ్రి ఖండించారు. అలాంటి ఉద్దేశం లేదంటూ ఆయన ఓ వీడియోను షేర్ చేసి.. అది రూమర్ అంటూ వ్యాఖ్యానించారు.
Sidhu Moose Wala: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ ముసేవాలాను మే 29న గుర్తు తెలియని దుండగులు పట్టపగలు కాల్చి చంపారు. ఈ హత్య పంజాబ్ రాజకీయాలను షేక్ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సిద్దూ హత్య పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా మద్దతుదారులు.. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో.. సిద్ధూ ముసేవాలా తల్లిదండ్రులు శనివారం హోంమంత్రి అమిత్ షాను కలిసి న్యాయం కోసం వేడుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సమయంలో కుటుంబం తమ కుమారుడి హత్యపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. సిద్ధూ ముసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరవచ్చు లేదా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లను సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్ ఖండించారు. తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, అలాగే.. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. ఈ మేరకు సిద్ధూ తండ్రి తన కుమారుడి యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతాలో 55 సెకన్ల ఓ వీడియోను శనివారం పోస్ట్ చేశారు. కొడుకును కోల్పోయిన తర్వాత ఉద్వేగానికి లోనైన ఆ తండ్రి సోషల్ మీడియాలో ఇలా అన్నాడు.
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను విని చాలా బాధపడ్డాను. ఇటీవల నేను నా కొడుకును కోల్పోయాను. నాపై చాలా రకాల పుకార్లు వస్తున్నాయి, అవి నమ్మడం లేదు. నాకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. నేను ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేను. జూన్ 8న ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయబడింది, అందులో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తాను. అని వీడియోలో పేర్కొన్నారు. వదంతాలను నమ్మవద్దని పేర్కొన్నారు.
కాగా, పంజాబ్ ప్రభుత్వం సిద్ధూ ముసేవాలాతో సహా రాష్ట్రంలోని 424 మందికి భద్రత ఉపసంహరించిన మరునాడైన మే 29న మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిద్ధూ ముసేవాలా శరీరంలోకి 19 బుల్లెట్లు చోచ్చుకుపోయాయి. దీంతో అతడు ఘటన స్థానంలోనే మరణించారు. తన కుమారుడి హత్యపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిద్ధూ కుటుంబం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో శనివారం చండీగఢ్కు వచ్చిన అమిత్ షాను సిద్దూ కుటుంబం కలిసింది. హంతకులను త్వరలో అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు.