కర్ణాటక  మాజీ సీఎం  సిద్దరామయ్య రాహుల్ గాంధీతో  భేటీ అయ్యారు.  ఈ భేటీలో  సిద్దరామయ్యను  సీఎం పదవికి  ఎంపిక  చేసేందుకు  కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపిందని సమాచారం. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య బుధవారంనాడు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. కర్ణాటక సీఎం పదవికి అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత సిద్దరామయ్య అనుచరులు నవ్వుతూ బయటకు వచ్చారు. కర్ణాటక సీఎం పదవికి ఎంపిక చేసిన అభ్యర్ధి పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బెంగుళూరులోని సిద్దరామయ్య నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రేపే సిద్దరామయ్య సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. కర్ణాటక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ కు పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం.

నిన్న సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు సమావేశమయ్యారు. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ సాయంత్రం లోపుగా ప్రకటించే అవకాశం ఉంది. 

మంత్రివర్గంలో డీకే శివకుమార్ సూచించిన వారికే ప్రాధాన్యత ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డీకే శివకుమార్ కు హామీ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కర్ణాటక సీఎం పదవిని తనకు కేటాయించాలని డీకే శివకుమార్ కోరుతున్నారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శివకుమార్ ను ఒప్పించారని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు రెండు కీలకమైన మంత్రిత్వశాఖలను కూడా డీకే శివకుమార్ కు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది.