Siddaramaiah Attempts to Slap Police Officer: బెళగావిలో జరిగిన ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను చెంపదెబ్బ కొట్టడానికి చేయి పైకెత్తినట్లు చూపించే వీడియోను జేడీఎస్ షేర్ చేసింది.
Siddaramaiah: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయి ఒక పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారు. బెళగావిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రసంగించడానికి ముందే సభా ప్రాంగణంలో గందరగోళం ఏర్పడడంతో ఆయన సహనం కోల్పోయారు. దీంతో అక్కడున్న పోలీసు అధికారి ASP నారాయణ్ భరమణిని చేత్తో కొట్టబోయారు. ఇప్పుడు ఇదే విషయం రాష్ట్రంలో దుమారం రేపుతోంది.
బీజేపీ మహిళా మోర్చా సభ్యులు నల్ల జెండాలతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కారణంగా, ప్రసంగానికి అడ్డంకి ఏర్పడింది. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి, సభా బాధ్యతలు చూస్తున్న పోలీసు అధికారి, ASP భరమణిని పిలిచి దురుసుగా ప్రవర్తించారు. సిద్ధరామయ్య తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక, అతనిపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, వెంటనే వెనక్కి తగ్గారు.
ఈ ఘటనకు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి, ముఖ్యమంత్రి పై విరుచుకుపడుతూ, అధికార అహంకారం అంగీకరించరాని చర్యగా విమర్శించాయి. జాతీయ ప్రజా దళ్ (జేడీఎస్) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీడియో ఒకటి షేర్ చేస్తూ, "అశాంతి, అధికార అహంకారం" అనే అంటూ ఘాటుగా స్పందించింది.
అధికార అహంకారం నెత్తికెక్కిందనీ, ముఖ్యమంత్రిగా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. వీధి రౌడీల ప్రవర్తించాడంటూ విమర్శలు చేసింది. "మీ పరిపాలన కాలం ఐదు సంవత్సరాలు మాత్రమే. కానీ ప్రభుత్వ ఉద్యోగి 60 సంవత్సరాలు వరకు పనిచేస్తారు. అధికారమంటే ఎవరికీ శాశ్వతం కాదు అంటూ జేడీఎస్ పేర్కొంది.
భారతీయ జనతా పార్టీ కూడా కర్ణాటక ముఖ్యమంత్రిపై విమర్శలు చేసింది. పార్టీ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, సిద్ధరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు.
"కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెలగావి లో జరిగిన ర్యాలీ లో ఒక పోలీస్ అధికారిని కొట్టేందుకు ప్రయత్నించారు. నేను ఈ చర్యను ఖండిస్తున్నాను. ఈ తీరులో ఆయన ఏ సందేశం ప్రజలకు అందించాలని కోరుకుంటున్నారు?" అని శోభా కరంద్లాజే అన్నారు.
"భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా మోర్చా నాయకురాళ్ళు కూడా ముఖ్యమంత్రిపై నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన చెయ్యగల హక్కు ఉంది" అని ఆమె అన్నారు.