బీజేపీతో పొత్తు పెట్టుకొని శివసేన 25 ఏళ్లు వృథా చేసింది - మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..
బీజేపీతో శివసేన పొత్తు పెట్టుకొని 25 ఏళ్లు వృథా చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
అధికారం కోసం భారతీయ జనతా పార్టీ (bjp) హిందుత్వాన్ని ఒక సాధనంలా ఉపయోగించుకుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (uddhav takre) అన్నారు. శివసేన (shiva sena)పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే (bal takre) 96వ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. శివసేన బీజేపీని మాత్రమే వీడిందని.. అయితే హిందుత్వాన్ని మాత్రం వదిలిపెట్టబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ వారికి (బీజేపీ) మద్దతిచ్చినది మేమే.. 25 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాం.. అధికారం కోసం బీజేపీ హిందుత్వాన్ని ఉపయోగించుకుంది.. ఆ పార్టీని వదిలేశాం కానీ హిందుత్వాన్ని మాత్రం వదలబోం.. బీజేపీది హిందుత్వం కాదు.. వారిని సవాల్ చేసినప్పుడు మాపై వ్యూహాలు అమలు చేశారు’’ అని థాకరే అన్నారు.
శివసేన పార్టీ బీజేపీతో మిత్రపక్షంగా గడిపిన 25 ఏళ్లు వ్యర్థమే అని తాను నమ్ముతానని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. హిందుత్వాన్ని పెంచేందుకే శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆయన తెలిపారు. పార్టీ రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు బీజేపీ అనేక చోట్ల పోల్ డిపాజిట్ల (pole diposite)ను కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలోనే ఆ పార్టీ సేనతో సహా అనేక ప్రాంతీయ పార్టీలతో జతకట్టిందని చెప్పారు. హిందుత్వానికి అధికారం కావాలనే ఉద్దేశంతోనే శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందని అన్నారు. కానీ అధికారం కోసం తమ పార్టీ ఎప్పుడూ హిందుత్వాన్ని ఉపయోగించలేదని ఆయన చెప్పారు.
శివసేన స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సవాల్ ను తాను స్వీకరించానని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (congress), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (nationalist congress party -NCP)తో పొత్తు నిర్ణయాన్ని ఠాక్రే సమర్థించుకున్నారు. ‘‘బీజేపీ తన జాతీయ ఆశయాలను నెరవేర్చడానికి మేము పూర్తిగా మద్దతు ఇచ్చాం. దాని ఉద్దేశం మేము మహారాష్ట్రంలో నాయకత్వం వహిస్తే, వారు జాతీయ స్థాయికి వెళ్తారని.. కానీ వారు మాకు ద్రోహం చేశారు. మా ఇంట్లోనే మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి మేము తిరిగి కొట్టాల్సి వచ్చింది’’ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అకాలీదళ్(akalidhal), శివసేన వంటి పాత భాగస్వామ్య పార్టీలు వెళ్లిపోయిన తరువాత బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీ ఏ కూటమి కుంచించుకుపోయిందని ఆయన అన్నారు.
శివసేన ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పాల్గొంటోందని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అయితే అక్కడ ఓడిపోయిన బాధపడవద్దని కార్యకర్తలను కోరారు. ‘‘ఓడిపోయినా కుంగిపోవద్దు.. ఏదో ఒకరోజు గెలుస్తాం’’ అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో శివసేన అన్ని స్థానాల్లో పోటీ చేయలేదని అన్నారు. ఈరోజు పార్టీ నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. అయినా పరవాలేదని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సమయంలో గెలిచిన స్థానాల కంటే ఇప్పుడు ఎక్కువే స్థానాలు గెలిచామని తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రామ్ కదమ్ (ram kadham) స్పందించారు. తమ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్ తో చేరబోదని చెప్పిన దివంగత నేత బాల్ ఠాక్రే సిద్ధాంతాలను ప్రస్తుతం శివసేన అనుసరిస్తోందో లేదో ఒక సారి మహారాష్ట్ర సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.