శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ భార్య రజిని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి ముంబై కుర్లాలోని తన ఇంట్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఆమె మృత‌దేహాన్నిపోస్టుమార్టం కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

మంగేష్ కుడాల్కర్ ముంబైలోని కుర్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివ‌సేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న భార్య రజనీ కుడాల్కర్ మృతదేహం కుర్లా ఈస్ట్‌లోని నెహ్రూ నగర్ ప్రాంతంలోని డిగ్నిటీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని వారి ఫ్లాట్‌లో రాత్రి 8.30 గంటలకు ఉరివేసుకున్న స్థితిలో క‌నిపించింద‌ని పోలీసు అధికారి తెలిపారు

ప్రాథమిక విచారణలో ఆత్మహత్యకు పాల్పడినట్లు నెహ్రూ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనికి సంబంధించి ప్రమాద మరణ నివేదిక (ఏడీఆర్) నమోదు చేస్తున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇంకా మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.