వరుస సెలవులతో షీర్డీ ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే రూ. 6.68 కోట్ల విరాళాలు వచ్చినట్టుగా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. ఇంకా కొన్ని విరాళాలను లెక్కించాల్సి ఉంది.

ముంబై: వరుస సెలవులతో మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయానికి భారీగానే విరాళాలు వచ్చాయి. వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో Shirdiలోని saibaba ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బుధవారం నాడు షిర్డీ సాయిబాబా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. బాబా సంస్థాన్ కు వరుస సెలవులతో రూ. 6.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.26.22 లక్షలు విలువచేసే వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.1.07 లక్షలు విలువచేసే వెండి నగలున్నాయి. 

అయితే షిర్డీ పుణ్యక్షేత్రంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన విరాళాలు స్వీకరించే కౌంటర్లలో పోగైన నగదు, అన్‌లైన్‌లో దాతలు పంపిన నగదు ఇంకా లెక్కించాల్సి ఉంది. corona ఆంక్షలు, ఆలయ దర్శన వేళలు కుదించినప్పటికీ పది రోజుల్లో భక్తులు పెద్దసంఖ్యలోనే బాబాను దర్శించుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల అనేక నెలలు షిర్డీసాయి ఆలయం మూసి ఉంచారు. 

దీంతో బాబా ఆలయానికి కానుకల రూపంలో లభించే ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా వైరస్‌ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో 2021 అక్టోబరు ఏడో తేదీ నుంచి ఆలయాన్ని తిరిగి తెరిచారు.

 కోవిడ్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తొలుత రోజుకు 12 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అనుమతి నిషేధించారు. కానీ ఈ సంఖ్య పెంచాలని బాబా ఆలయ సంస్ధాన్‌పై భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో పెరుగుతున్న భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని రోజుకు 25 వేల మంది భక్తులను అనుమతించసాగారు. దీంతో హుండీలో భక్తులు సమర్పించుకుంటున్న కానుకలు కూడా పెరిగాయి.

lock downకు ముందు ఆదాయంతో పోలిస్తే ఈ విరాళాలు తక్కువే అని చెప్పారు. ఒక పక్క కోవిడ్‌ ఆంక్షలు, దర్శన వేళలు కుదించడం, మరోపక్క రోడ్డు, రైలు రవాణ సౌకర్యాలు సరిగా లేకపోవడంతో షిర్డీకి వచ్చే భక్తుల తాకిడి సగానికి తగ్గిపోయింది. గతంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాబాకు కానుకల రూపంలో సుమారు రూ.10–12 కోట్లమేర ఆదాయం వచ్చేది. ఇప్పుడు సగానికి పడిపోయిందని వారు అంటున్నారు.

గత ఏడాది అక్టోబర్ 6న ప్రతి రోజూ 15 వేల భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించింది. కరోనా కేసుల తగ్గుదలతో గత ఏడాది నవంబర్ 21 న మరో 10 వేల మంది భక్తులను దర్శించుకొనేందుకు అధికార యంత్రాంగం అనుమతించింది. దీంతో ప్రతి రోజూ 25 వేల మంది భక్తులు బాబా ఆలయాన్ని దర్శించుకొనే అవకాశం కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సూచించిన అన్ని కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. ఆన్ లైన్ పాసులతో పాటు ఆఫ్ లైన్ లో కూడా భక్తులకు కౌంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది.గతంలో కరోనా రెండో విడత సమయంలో మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో షిర్డీ ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.