హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు.. 16 మంది దుర్మరణం.. మృతుల్లో స్కూల్ విద్యార్థులు
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలో సోమవారం ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది మరణించారు. వారిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలో సోమవారం ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది మరణించారు. వారిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కులు డిప్యూటీ కమీషనర్ అశుతోష్ గార్గ్ మాట్లాడుతూ.. ఉదయం 8.30 గంటల సమయంలో సైన్జ్ వైపు వెళ్తున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలికి చేరుకున్నాయని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రజలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఘటన స్థలం నుంచి వస్తున్న దృశ్యాలను చూస్తే.. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తుంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.