అమ్రేష్ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్ను రైస్ పుల్లింగ్ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట.
ఈ మధ్యకాలంలో మోసగాళ్లు పెరిగిపోతున్నారు. అమాయకంగా కనిపిస్తే చాలు.. కుచ్చిటోపీ పెట్టి డబ్బులు గుంజేస్తున్నారు. తాజాగా.. రైస్ పుల్లింగ్ పేరిట మోసానికి పాల్పడ్డాడు. కాగా.. అలా మోసానికి పాల్పడిన వ్యక్తి.. ప్రముఖ సినీ నటి జయచిత్ర కొడుకు కావడం గమనార్హం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్.. నటుడిగా పలు చిత్రాలలో నటించారు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ అనే వ్యక్తిని రైస్ పుల్లింగ్ పేరుతో రూ. 26 కోట్లకు నటుడు అమ్రేష్ మోసం చేశాడనే విషయం తెలిసి.. కోలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. ప్రస్తుతం అమ్రేష్ను ఇదే విషయమై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు.
అమ్రేష్ తన స్నేహితులతో కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి నెడుమారన్ను రైస్ పుల్లింగ్ పేరుతో మాయ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడట. రైస్ పుల్లింగ్ కలశం అని చెప్పి, అది ఇంటిలో ఉంటే.. ప్రపంచాన్ని జయించవచ్చని తెలుపుతూ.. 8 సంవత్సరాలుగా మోసం చేస్తూ.. ఇప్పటి వరకు రూ. 26 కోట్లను నెడుమారన్ నుంచి వసూలు చేశారట. రైస్ పుల్లింగ్ కలశం ఇంటిలో పెట్టుకున్నా.. ఎటువంటి మార్పు లేకపోవడంతో.. వెంటనే నెడుమారన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అమ్రేష్ను, అతని సన్నిహితుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.
