జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై రెండు వారాల పాటు స్టేటస్ కో ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ విషయమై నార్త్ డీఎంసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని Jahangirpuri లో అక్రమ నిర్మాణాల Demolitionపై Status Quo ను కొనసాగించాలని Supreme Court గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల డ్రైవ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై నార్త్ DMC తో పాటు పలువురికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని నార్త్ డీఎంసీకి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను నిరసిస్తూ జమియత్ ఉలమా ఐ హింద్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఒక వర్గానికి చెందిన వారి నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని కూల్చివేస్తున్నామనే వాదన సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలిపిన తర్వాత కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా పరిగణిస్తామని కూడా ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణల కూల్చివేతలను నిలిపివేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు తమకు అందలేదని చెబుతూ నిర్మాణలు కూల్చివేశారు.ఈ ఘటనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయం తెలుసుకొన్న CPM పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రొక్లెయినర్లకు అడ్డుగా నిలబడి నిరసనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశాల విషయమై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమకు ఆదేశాలు అందలేదని అధికారులు చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు అందిన తర్వాత నిర్మాణాల కూల్చి వేతను నిలిపివేశారు.
జహంగీర్ పురి కూల్చివేతల విషయమై ఇవాళ జరిగిన విచారణ సమయంలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పరిణామాలను పిటిషనర్ల తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా కూల్చివేతలు చేయడాన్ని ఉన్నత న్యాయ స్థానం తప్పుబట్టింది.
