ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్..!
ప్రస్తుతం వైద్యులు ఆయనను అన్ని పరీక్షలు చేస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో.. ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
అయితే.. వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్యం కారణంగా ఆయన గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు ఆయనను అన్ని పరీక్షలు చేస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. గతేడాది అక్టోబరులో కరోనా బారిన పడి కోలుకున్న ములాయం సింగ్ యాదవ్... ఇటీవల కరోనా టీకా వేయించుకున్నారు.
ములాయం ఉత్తరప్రదేశ్ కి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996-98 మధ్య కేంద్ర రక్షణ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ సీఎంగా విధులు నిర్వహించారు.