పుడమిని కాపాడుకుందాం అని ఉద్యమం మొదలు పెట్టిన సద్గురు జగ్గీ వాసుదేవ్ దీనిపై ప్రపంచవ్యాప్తంగా వేగంగా అవగాహన కల్పించాలని 100 రోజుల బైక్ జర్నీ ప్రారంభించారు. ఈ యాత్ర 27 దేశాల గుండా సుమారు 30 వేల కిలోమీటర్ల మేర సాగనుంది.
న్యూఢిల్లీ: ఇషా ఫౌండేషన్ నేత సద్గురు జగ్గీ వాసుదేవ్ పుడమి రక్షణ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 100 రోజుల బైక్ యాత్రను ఈ రోజు ప్రారంభించారు. లండన్లోని ట్రాఫల్గర్ స్క్వేర్ నుంచి ఈ బైక్ జర్నీని సోమవారం ప్రారంభించారు. ఈ ప్రయాణం 27 దేశాల గుండా 30 వేల కిలోమీటర్లు సాగనుంది. భూసారం నాణ్యతను కోల్పోయి నిస్సారంగా ఎడారిగా మారకుండా కాపాడుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సేవ్ సాయిల్ పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన తీసుకురావాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా ఆయన ఒంటరిగా మోటార్ సైకిల్పై యూకే, యూరప్, పశ్చిమ దేశాల గుండా ప్రయాణించనున్నారు. చివరకు ఇండియాకు చేరుకుంటారు. కొన్ని నెలలపాటు సాగనున్న ఈ ప్రయాణంలో సద్గురు ఎంతో మంది ప్రపంచ నేతలు, మీడియా, ఇతర నిపుణులను కలుసుకుంటారు. పుడమిని రక్షించుకోవడానికి ఆయన వారితో చర్చలు జరపనున్నారు. వారు కూడా అటువైపుగా నిర్ణయాలు తీసుకోవడానికి, అడుగులు వేయడానికి ప్రోత్సహించనున్నారు.
యునైటెడ్ నేషన్స్ కాన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ప్రకారం, 90 శాతం భూమి 2050 కల్లా నిస్సారంగా మారిపోయే ముప్పు ఉన్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, నీటి సంక్షోభం ఏర్పడవచ్చని తెలుపుతున్నది. అంతేకాదు, భయానక కరువు కాటకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆ రిపోర్టు తెలుపుతున్నది. ఇది మానవాళి మనుగడకే ముప్పు. కాబట్టి, ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని సద్గురు భావిస్తున్నారు.
ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి కరేబియన్ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటివరకు 6 కరేబియన్ దేశాలు సద్గురు నేతృత్వంలోని నేలను రక్షించే ఉద్యమంలో చేరాయి. దీని కోసం ఆయనతో కలిసి ముందుకు సాగడానికి అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి.
సద్గురు జగ్గీవాసుదేవ్ తో కలిసి నేలను పరిరక్షించే ఉద్యమంలో ఆరు కరేబియన్ దేశాలు.. ఆంటిగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, బార్బడోస్ లు చేరాయి. ఆయా దేశాలు నాయకులు సద్గురుతో ప్రారంభించిన Save Soil Movement లో కలిసి ముందుకు సాగడానికి ఒప్పందంపై సంతకాలు చేశారు. మట్టి క్షీణతను తిప్పికొడుతూ.. నేల తల్లి రక్షణకు కృషి చేస్తూ.. దీర్ఘకాలిక ఆహారాన్ని అందించడానికి తమ దేశాలలో ఖచ్చితమైన చర్యను ప్రారంభించాలని ఒప్పందం సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేశారు.
నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ తో పాటు ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ లు కూడా మద్దతు పలికారు.
