భారత్కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి.. రష్యా మద్దతు
ఐరాస భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా ఈ రోజు యూఎన్జీఏ 77వ సెషన్లో పేర్కొంది. ఇండియా, బ్రెజిల్లు అంతర్జాతీయ విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. భారత్కు ఇప్పటి వరకు ఐదింట నాలుగు శాశ్వత సభ్య దేశాలు ఇందుకు మద్దతు తెలుపడం గమనార్హం.
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా తెలిపింది. శాశ్వత సభ్యత్వానికి భారత్ అర్హురాలని వివరించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ 77వ సెషన్లో భారత విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ ఈ విషయంపై మాట్లాడారు.
భారత్ అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. శాశ్వత సభ్యత్వానికి సరిపోయే దేశం అని వివరించారు. అంతర్జాతీయ అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న దేశాలుగా తాము ఇండియా, బ్రెజిల్లను భావిస్తున్నట్టు తెలిపారు. కాబట్టి, ఈ రెండు దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని పేర్కొన్నారు. ఆఫ్రికా ప్రొఫైల్ను కూడా తాము లేవనెత్తుతున్నామని చెప్పారు.
ఇదే సెషన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామికం చేసేలా రష్యా ఆలోచనలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా భద్రతా మండలిని మరింత ప్రజాస్వామికం చేయాలన్న ఉద్దేశ్యాలు రష్యా ఆలోచనల్లో ప్రస్ఫుటిస్తున్నాయని తెలిపారు.
అదే విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైనా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. తాము శాంతి నెలకొల్పాలని పిలుపు ఇస్తున్నట్టు తెలిపారు. దౌత్య మార్గాన్ని అవలంభించి ఈ యుద్ధానికి చరమగీతం పాడాలని సూచించారు. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ యుద్ధంలో భారత్ శాంతి వైపు నిలబడిందని పేర్కొన్నారు.
ఐరాస భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాలు ఉన్నాయి. ఈ ఐదు దేశాల్లో ఇప్పటికి నాలుగు దేశాలు భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు తెలిపాయి. కేవలం ఒక చైనా మాత్రమే అడ్డు తెలుపుతున్నది. అయితే, తాము ఐరాస భద్రతా మండలిలో సంస్కరణల విషయమై తాము చైనాతో చర్చిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయం మంత్రి వీ మురళీధర్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇదే సందర్భంంలొ ఉగ్రవాదం విషయమై భారత్.. చైనా, పాక్లపై విరుచుకుపడింది.