సారాంశం

జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ లో ఓ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. మరో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ నలుగురు మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్-ముంబై రైలులో ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ నలుగురు ప్రయాణికులను కాల్చి చంపాడు. మృతుల్లో ఓ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. కానిస్టేబుల్ తన ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటన చోటు చేసుకున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ (12956) జైపూర్ నుంచి ముంబై వెళ్తోంది. రైలు పాల్ఘర్ స్టేషన్ దాటుతున్న క్రమంలో, ముంబైకి ఇంకా 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కానిస్టేబుల్ తన సహోద్యోగితో వాగ్వాదానికి దిగాడని, దీంతో కొందరు జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో వారందరిపై ఆ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని సమాచారం. ఈ ఘటన బీ5 కోచ్ లో ఉదయం 5 గంటల కు ప్రయాణికులందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల శబ్దంతో ఒక్క సారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కానిస్టేబుల్ కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. 

నిందితుడిని చేతన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన అనంతరం చేతన్ దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకాడు. నిందితుడైన కానిస్టేబుల్ ను అతని ఆయుధంతో పాటు అదుపులోకి తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా నలుగురు మృతి చెందినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ ఘటనపై నార్త్ జీఆర్పీ డీసీపీకి సమాచారం అందించినట్లు ఆర్పీఎఫ్ తెలిపింది.