పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ నాయకుడు మాత్రం భార్యకు ఏకే 47 తుపాకీని బహుమతిగా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నాడు. భార్య సబీనా యాస్మిన్ ఏకే 47 తుపాకీని పట్టుకుని వున్న చిత్రాన్ని రియాజుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది.
తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యాభర్తలిద్దరూ బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బంగారం, డైమండ్, ఇతర విలువైన వస్తువులను కానుకలుగా ఇచ్చుకుని తమ బంధాన్ని మరింత పటిష్టంగా మార్చుకుంటారు ఆలుమగలు. అయితే పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ నాయకుడు మాత్రం భార్యకు ఏకే 47 తుపాకీని బహుమతిగా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నాడు. టీఎంసీ మాజీ నేత రియాజుల్ హక్ తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు ఏకే 47 రైఫిల్ను బహుమతిగా ఇచ్చాడు. తన భార్య సబీనా యాస్మిన్ ఏకే 47 తుపాకీని పట్టుకుని వున్న చిత్రాన్ని రియాజుల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది.
దీనిని చూసిన స్థానిక బీజేపీ నేతలు, సీపీఎం నేతలు తాలిబాన్ పాలనను ప్రోత్సహిస్తున్నారంటూ రియాజుల్పై విమర్శలు గుప్పించారు. దీంతో అతను పోస్ట్ను తొలగించాడు. సైనిక, పారామిలటరీ దళాలు విస్తృతంగా వినియోగించే రైఫిల్ రియాజుల్ వద్దకు ఎలా చేరింది అంటూ విపక్షాలు మండిపడ్డాయి. తన చర్యను సమర్ధించున్న రియాజుల్.. తన భార్య పట్టుకుంది బొమ్మ తుపాకీ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతకుమించి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని, అది నకిలీ తుపాకీ కాబట్టి తనపై వచ్చిన ఆరోపణ నిరాధారమన్నారు.
డిప్యూటీ స్పీకర్, రామ్పూర్హట్ ఎమ్మెల్యే ఆశిష్ బందోపాధ్యాయకు సన్నిహితుడిగా చెబుతున్న రియాజుల్పై నెటిజన్లు సైతం విమర్శలు గుప్పించారు. రియాజుల్ ఒకప్పుడు తృణమూల్ మైనారిటీ సెల్ రామ్పుర్హాట్ 1 బ్లాక్కు అధ్యక్షుడిగా వుండేవారని స్థానిక వర్గాలు చెప్పాయి. అయితే రెండు నెలల క్రితమే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు రియాజుల్కు ఆయుధం లభించడంపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీపీఎం సైతం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చింది.
