ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్. ముత్తా గౌతమ్, అరుణ్ రాంచంద్రన్, సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్లకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని కోరారు. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి మనీలాండరింగ్కు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక, ఇప్పటి వరకు ఈడీ ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.
ఈ కేసుకు సంబంధించి గత ఆదివారం ఆప్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు.
