దొంగతనానికి వెళ్లి.. చేపల పులుసు కనపడగానే...
ఎంత వెతికినా డబ్బు, నగలు ఏమీ కనపడలేదు. దీంతో.. నిరాశగా వెనుదిరిగాడు. ఇంతలో అతనికి కిచెన్ లో కమ్మగా వండి పెట్టిన చేపల పులుసు వాసన వచ్చింది.
దొంగతనానికి వెళ్లిన దొంగ ఏమి చేస్తాడు.. కనపడిన సొత్తు మొత్తం దోచుకొని వచ్చేస్తాడు. కదా... కానీ ఓ దొంగ మాత్రం అలా చేయలేదు. దొంగతనానికి వెళ్లి.. ఆ ఇంట్లో చేపల పులుసు కనపడగానే.. కడుపునిండా లాగించేశాడు. అనంతరం అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం కన్నియాకుమారి జిల్లా పరైకోడు గ్రామంలో సతీష్ అనే ఓ దొంగ అక్కడ ఓ ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఎంత వెతికినా డబ్బు, నగలు ఏమీ కనపడలేదు. దీంతో.. నిరాశగా వెనుదిరిగాడు. ఇంతలో అతనికి కిచెన్ లో కమ్మగా వండి పెట్టిన చేపల పులుసు వాసన వచ్చింది.
అసలే ఆకలితో నకనకలాడిపోతున్న ఆ దొంగ వంటగదిలోకి దూరి చేపలు పులుసు వేసుకుని ఫుల్లుగా తిన్నాడు. భుక్తాయాసం ఎక్కువై.. డాబాపైకెళ్లి కాసేపు పడుకుని తెల్లవారుజామునే పారిపోదామనుకున్నాడు. కానీ.. తెల్లవారినా లేవలేకపోయాడు. డాబాపై నిద్రపోతున్న దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.