Asianet News TeluguAsianet News Telugu

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30మంది నర్సింగ్ విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం...

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు చెందిన ఓ బస్సు ప్రమాదానికి గురై అందులోని 30మంది గాయాలపాలయ్యారు.

road accident in Nalgonda, 30 nursing students injured
Author
First Published Dec 12, 2022, 11:24 AM IST

నల్గొండ : నల్గొండ జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న నర్సింగ్ విద్యార్థుల బస్సుకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో నర్సింగ్ కాలేజీ విద్యార్థుల బస్సును  వెనకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు.  వీరంతా నల్గొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి… చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో  గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 30 మంది గాయపడ్డారు.ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. రూ. 10 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే డిసెంబర్ 8న చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గత బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళుతుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగినట్లుగా  సమాచారం.

గత గురువారం పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో ఐరాల మండలం బలిజ పల్లికి చెందిన హేమంత్ కుమార్ వివాహం ఉంది. దీని కోసం దాదాపు 30 మంది హేమంత్ కుమార్ తరఫు బంధువులు బయలుదేరారు. బుధవారం రాత్రి ట్రాక్టర్లో జెట్టిపల్లికి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  పూతలపట్టు మండలంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వసంతమ్మ (50), డ్రైవర్ సురేందర్ రెడ్డి .(52), రెడ్డెమ్మ (31), తేజ(25)లతో పాటు.. చిన్నారులు  వినీషా (3),  దేశిక (2)లు కూడా  ఉన్నారు.

మిగతా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. డ్రైవర్ సురేందర్రెడ్డి ట్రాక్టర్ గేర్ ను న్యూట్రల్ చేసి.. వాహనాన్ని వేగంగా నడిపించడం తోనే అదుపు తప్పిందని.. రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దిగిపోయిందని..  బోల్తా పడింది అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios