heatwave: దేశరాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్-12) నుంచి ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. వేడిగాలుల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే తక్కువగా నమోదవుతాయని ఐంఎండీ పేర్కొంది.
India Meteorological Department: ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత, వేడిగాలుల కారణంగా ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అయితే, తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. దేశరాజధానితో పాటు పలు ప్రాంతాల్లో మంగళవారం (ఏప్రిల్-12) నుంచి ఎండల తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. వేడిగాలుల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే తక్కువగా నమోదవుతాయని ఐంఎండీ పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. ఏప్రిల్ 12 నుంచి వాయువ్య భారతంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రజలు తీవ్రమైన వేడిగాలుల పరిస్థితుల నుంచి ఉపశమనం పొందుతారంటూ గుడ్ న్యూస్ చెప్పింది. IMD ప్రకారం... పశ్చిమ హిమాలయ ప్రాంతంపై ఏప్రిల్ 12, మంగళవారం రాత్రి నుండి తాజా పాశ్చాత్య అలజడి ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని కారణంగా వేడిగాలుల తీవ్రత తగ్గుతుందనీ, ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంపై ప్రభావంతో వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో వేడి తరంగాల పరిస్థితుల తీవ్రత మరియు ప్రవాహం తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ పర్యవేక్షణ శాఖ చెప్పారు.
కాగా, గత కొన్ని రోజులుగా దేశంలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో రికార్డు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత 40-43.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవడంతో ఢిల్లీ ప్రజలు ప్రస్తుతం వేడిగాలుల పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. గత 24 గంటల్లో, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా-ఢిల్లీలోని చాలా ప్రాంతాలతో పాటు పశ్చిమ రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6-10 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
దేశ రాజధానిలో తీవ్రమైన హీట్వేవ్ పరిస్థితులు ఉన్నందున IMD ప్రజలను హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏప్రిల్ 10 న 'ఆరెంజ్' హెచ్చరికను సైతం జారీ చేసింది. ఢిల్లీలో శనివారం 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత ఐదేండ్లలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు(వేడి) నమోదైన రోజుగా నిలిచింది. గతంలో అంటే 2017 ఏప్రిల్ 21న 43.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఏప్రిల్ 29, 1941న 45.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఏప్రిల్ ప్రథమార్థంలో ఢిల్లీలో ఇంత అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం 72 ఏళ్లలో ఇదే తొలిసారి అని ఐఎండీ తన హెచ్చరికలో పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు వస్తే.. జాగ్రత్తలు తీసుకోవానీ, నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
