ఏసీబీ భయం.. రూ.20లక్షలు తగలపెట్టిన తహసీల్దార్
పర్వత్ ను పోలీసులు విచారిస్తున్న క్రమంలో... దీనిలో తన ప్రమేయం ఏమీలేదని.. తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను ఇలా చేస్తున్నానని చెప్పాడు.
ఆయన లంచాలు తీసుకోవడంలో ఆరితేరాడు. ఆ లంచాలతోనే అంతులేని డబ్బు సంపాదించాడు. కాగా.. అతని అవినీతికి ఫుల్ స్టాప్ పడే రోజు రానేవచ్చింది. అతని ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేయడానికి వచ్చాడు. ఈ విషయం ఇతనికి తెలిసిపోయింది. అధికారులకు దొరకకుండా ఉండేందుకు ఏకంగా రూ.20లక్షలు తగలపెట్టాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచ తీసుకుంటున్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్ ను ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. పర్వత్ ను పోలీసులు విచారిస్తున్న క్రమంలో... దీనిలో తన ప్రమేయం ఏమీలేదని.. తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను ఇలా చేస్తున్నానని చెప్పాడు.
దీంతో వెంటనే తహసీల్దార్ ని కూడా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు బయలు దేరారు. ఈ దాడులకంటే ముందు ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం అందుకున్న కల్పేష్ కుమార్ ఇంట్లో ఉన్న 20 లక్షల్ని ఇంటిలోపల తాళం వేసి వంటగదిలో గ్యాస్ పై తగలబెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటి డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.., జైన్ తగలబెట్టిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో జైన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కాలిన నోట్లు కాకుండా విడిగా ఉన్న 1.5లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు.