Raj Thackeray: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం మరింతగా ముదురుతోంది. తగ్గేదేలే అంటున్న రాజ్ థాక్రే 'మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగిస్తాం' అని బాలాసాహెబ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Loudspeaker Row: మహారాష్ట్ర రాజకీయాలను లౌడ్ స్పీకర్ల వివాదం కుదుపేస్తోంది. వెనక్కి తగ్గదేలే అంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే ముందుకు సాగుతున్నారు. మే 3 తర్వాత ఎలాంటి ఘటనలు జరిగినా తన బాధ్యత ఉండదనిరాజ్ థాక్రే హెచ్చరించారు. మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకుల తొలగింపునకు సంబంధించి ఆయన ఇచ్చిన గడువును మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే బుధవారం నుంచి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకులు ఆన్ చేసిన సమయంలో.. ఎంఎన్ఎస్ కు చెందిన కార్యకర్తలు లౌడ్ స్పీకర్లను మసీదుల ముందు పెట్టి.. హనుమాన్ చాలీసాను ప్లే చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశముండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజ్ థాక్రే.. 'తన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగిస్తాను' అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో 36 సెకన్ల నిడివి గల వీడియోను ట్వీట్ చేశారు.. ఇందులో బాలాసాహెబ్ శివసేన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం యొక్క అభివృద్ధి మతం మధ్యలో రాని విధంగా ఉండాలని అందులో ఆయన వ్యాఖ్యనించారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని వీడియో చెప్పడం వినవచ్చు.
'అజాన్' శబ్దంతో ప్రజలు ఇబ్బందిపడితే 100కి డయల్ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాజ్ థాక్రే అంతకు ముందురోజు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. "రేపు మే 4వ తేదీన మీరు లౌడ్స్పీకర్ ఆజాన్తో మోగడం వింటుంటే, ఆ ప్రదేశాలలో హనుమాన్ చాలీసాను లౌడ్స్పీకర్లలో ప్లే చేయండి. అప్పుడే ఈ లౌడ్స్పీకర్ల అవరోధం ఏమిటో వారు గ్రహిస్తారని నేను హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను" అని MNS నాయకుడు రాజ్ థాక్రే ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారినై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను పరిరక్షించడానికి మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారనీ, శాంతికి విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ రజనీష్ సేథ్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై రాజ్ థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబయి పోలీసులు CrPC సెక్షన్ 149 కింద MNS చీఫ్కి నోటీసులు జారీ చేశారు. బుధవారం కూడా చాలా మంది ఎంఎన్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
