Rahul Gandhi fined: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీకి ₹200 జరిమానా పడింది. ఇంతకూ ఈ జరిమానా ఎవరు, ఎందుకు వేసారో తెలుసా?  

Rahul Gandhi : ఓ కేసు విచారణకు కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంతో లక్నో కోర్టు ₹200 జరిమానా విధించింది. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ACJM) కోర్టులో ఈ చర్య జరిగింది. వీర్ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ ఇక్కడ హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు ఫైన్ తో వదిలేసిన కోర్టు ఏప్రిల్ 14న హాజరు కాకపోతే మాత్రం రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. 

రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో వీర్ సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్‌ను "బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడు, పెన్షన్ తీసుకునే వ్యక్తి" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా న్యాయవాది నృపేంద్ర పాండే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కోర్టులో ఏం వాదించారు?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరపున న్యాయవాది ప్రాన్షు అగర్వాల్ కోర్టులో వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ముఖ్యమైన సమావేశంలో బిజీగా ఉన్నారని, అలాగే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందుకే కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన కోర్టుకు హాజరు మినహాయింపు పిటిషన్ దాఖలు చేశారు. 

రాహుల్ గాంధీకి పదే పదే సమన్లు పంపినా హాజరుకావడం లేదని పిటిషనర్ న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టుకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. 

తప్పనిసరిగా తర్వాతి విచారణకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆయన ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కాకపోతే, ఆయనపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.