కిసాన్ మహాపంచాయత్ ఫేక్ న్యూస్ షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వెల్లువెత్తిన విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మరోసారి విమర్శలపాలయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం రైతులు నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ను పేర్కొంటూ పాత ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి నకిలీ ఫొటోలు షేర్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయానాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కిసాన్ మహాపంచాయత్కు సంబంధించి తప్పుడు చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం రైతులు భారీస్థాయిలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ గురించి ఆయన పోస్టు పెట్టాలనుకున్నారు. రైతు ఆందోళనలకు అనుకూలంగా వ్యాఖ్యానించిన పెట్టిన ఫొటో మాత్రం ఇప్పటిది కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న షామ్లీలో నిర్వహించిన కిసాన్ పంచాయత్కు సంబంధించిన ఫొటోను తాజా కార్యక్రమానిదిగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతే, ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి ఇలా ఫేక్ ఫొటోలు పెడుతున్నారంటూ ఘాటు విమర్శలు వచ్చాయి.
ఫ్రాంటల్ ఫోర్స్ ట్విట్టర్ ఖాతా ఈ విషయాన్ని వెంటనే లేవనెత్తింది. ది ట్రిబ్యూన్ పత్రిక కథనాన్ని జోడించి కాంగ్రెస్ పీఎం క్యాండిడేట్ నకిలీ ఫోటొను షేర్ చేశారని విమర్శించింది. ఈ ఫొటో షామ్లీలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించినదని పేర్కొంది. వెంటనే మరికొంతమంది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. దయచేసి సోషల్ మీడియా టీమ్ను పటిష్టం చేసుకోవాలని, పాత ఫొటోలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని వ్యంగ్యవ్యాఖ్యానాలు చేశారు.
రాహుల్ గాంధీ ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం ఇది తొలిసారేమీ కాదు. గతవారం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 25లను కాలరాస్తున్నదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా వివాదాస్పదమైంది. ఈ పోస్టుకు జత చేసిన వీడియో ఫేక్ కావడంతో ఆయన విమర్శలపాలయ్యారు.
లడాఖ్లోని పలుప్రాంతాల్లో చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటివచ్చాయని పేర్కొంటున్న మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు. ఈ కథనాన్ని ఫేక్ అని ఇండియన్ ఆర్మీ కొట్టిపారేసింది.