కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్కు చెందిన ప్రసిద్ధ వంటకం చంపారన్ మటన్ను రాహుల్ గాంధీ సిద్దం చేశారు. అది కూడా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలతో కావడం విశేషం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో గతానికి భిన్నంగా నడుచుకుంటున్న సంగతి తెలిసిందే. తనలో ఉన్న కొత్త కొత్త ట్యాలెంట్స్ను ఆయన పరిచయం చేస్తున్నారు. కొత్త కొత్త మెళకువలు కూడా నేర్చుకుంటున్నారు. అయితే తాజాగా బీహార్కు చెందిన ప్రసిద్ధ వంటకం చంపారన్ మటన్ను రాహుల్ గాంధీ సిద్దం చేశారు. అది కూడా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలతో కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఏడు నిమిషాల నిడివితో కూడిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో పోస్టు చేశారు.
ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్.. చంపారన్ మటన్ను సిద్దం చేయడంలో వివిధ దశలను సూచించడాన్ని చూడొచ్చు. సుగంధ ద్రవ్యాలు జోడించడం, మాంసాన్ని ఎలా ఉడికించాలనే వివరాలను లాలూ చెబుతుండగా.. వాటిని రాహుల్ ఫాలో అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ల మధ్య ఆసక్తికర సంభాషణలు కూడా సాగాయి.
‘‘నాకు వంట చేయడం తెలుసు.. కానీ నేను నిపుణుడిని కాదు. నేను యూరప్లో పనిచేస్తున్నప్పుడు నేను వంట నేర్చుకోవలసి వచ్చింది. నేను ఒంటరిగా ఉండేవాడిని.. కాబట్టి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేను బేసిక్ వంటకాలు వండగలను. కానీ నేను నిపుణుడిన కాదు. లాలూ యాదవ్ జీ గొప్ప ఆహారాన్ని తయారు చేస్తారు’’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఆ తర్వాత మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారని లాలూను రాహుల్ అడిగారు. ఇందుకు.. ‘‘నేను 6 లేదా 7 వ తరగతి చదువుతున్నాను. నేను పని చేస్తున్న నా సోదరులను కలవడానికి పాట్నా వెళ్ళాను. అప్పుడు వారు నన్ను పిలిచారు. నేను వారికి వంట చేయడం, కట్టెలు సేకరించడం, పాత్రలు కడగడం, మసాలా దినుసులు రుబ్బడం వంటివి చేసాను. నేను అక్కడ అన్నీ నేర్చుకున్నాను’’ అని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.
ఇక, ఈ వంటకం సిద్ధమవుతుండగా, రాహుల్ గాంధీ రాజకీయాల్లో రహస్య మసాలా గురించి లాలూ ప్రసాద్ యాదవ్ను అడిగారు. ఇందుకు బదులిచ్చిన లాలూ సీక్రెట్ మసాలా అనేది హార్డ్ వర్క్ అని పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఇది (వంట) రాజకీయాలకు ఎలా భిన్నంగా ఉంటుంది? అని అడిగిన రాహుల్ గాంధీ.. ‘‘రాజకీయాల్లో ప్రతిదీ కలపడం’’ గురించి ప్రస్తావించారు. ‘‘అవును, నేను చేస్తాను. కొంచెం కలపకుండా రాజకీయాలు అసాధ్యం’’ అని ఇందుకు లాలూ ప్రసాద్ యాదవ్ సమాధానమిచ్చారు.

‘‘తదుపరి తరం రాజకీయ నాయకులకు మీ సలహా ఏమిటి’’ అని రాహుల్ గాంధీ లాలూను ప్రశ్నించారు. ‘‘నా సూచన ఏమిటంటే, మీ తల్లిదండ్రులు, మీ తాతలు దేశాన్ని కొత్త మార్గంలో, ధర్మమార్గంలోకి నడిపించారు. మీరు దానిని ఎప్పటికీ మరచిపోకూడదు’’ అని లాలూ పేర్కొన్నారు.
ఇక, ఈ విందు సెషన్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన సోదరి మిసా భారతి కూడా ఉన్నారు. వారు లాలూ మార్గనిర్దేశంలో రాహుల్ చేసిన ఆ వంటకాన్ని ఆస్వాదించడం కూడా వీడియో చూడవచ్చు. చివరిలో రాహుల్ గాంధీతన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కోసం మటన్ వంటకాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్లారు.
