62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సిద్ధూ భేటీ.. ‘‘గాలి మార్పు’’ అంటూ ట్వీట్
పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూను నియమిస్తున్నట్టు ఆదివారం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి నుంచే ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశం అయ్యారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియమితులైన రోజుల వ్యవధిలోనే నవజోత్ సింగ్ సిద్ధూ తన మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశమయ్యారు. బుధవారం అమృత్ సర్ లోని తన నివాసంలో 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సమావేశాన్ని ఆయన ‘గాలి మార్పు’ అంటూ అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో ‘ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల యొక్క’ అంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.
కాగా, పీసీసీ చీఫ్ గా సిద్ధూను నియమిస్తున్నట్టు ఆదివారం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సన్నిహిత నేతలతో సిద్ధూ సమావేశమయ్యారు. వాస్తవానికి చాలా రోజులుగా కెప్టెన్ అమరీందర్ కు, సిద్ధూకు అస్సలు పొసగడం లేదు. సీఎం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సిద్ధూ వ్యతిరేకిస్తూ వచ్చారు. వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవడం దగ్గర్నుంచి.. మొన్నటి కరెంట్ కోతల వరకు సీఎంపై సిద్ధూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ జరుగుతోందోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.