పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఘోర వైఫల్యం తప్పదనే ఓట్ల లెక్కింపు సరళిలలో వెల్లడి అవుతున్నది. అధికారంలోని పార్టీ ఓటమి అంచుల్లోకి చేరుతుండటంతో ఆ పార్టీ సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగిన రాష్ట్ర ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. త్వరలోనే ఆయన గవర్నర్ బన్వీరీలాల్ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించనున్నట్టు సమాచారం అందింది.

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతీసేలా ఉన్నాయి. ఫలితాల సరళి చూస్తుంటే.. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని స్పష్టం అవుతున్నది. కాగా, తొలిసారి ఆప్ ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించి అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు పశ్చాత్తాపంలోకి వెళ్లుతున్నట్టు అర్థం అవుతున్నది. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే రాజీనామాను ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మంగళవారం ఉదయం ఆయన చండీగడ్‌లోని తన అధికారిక నివాసానికి చన్నీ వచ్చారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత వైరుధ్యాలు కొంతకాలంగా తీవ్రమైన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల కారణంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్దూ సీఎం అవుతారని ఆశించినా.. పార్టీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా చాలా కాలానికి గానీ అక్కడ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేకపోయింది. అప్పటి వరకు నవజోత్ సింగ్ సిద్దూ, చరణ్‌జిత్ సింగ్ చన్నీల మధ్య బేధాభిప్రాయాలు కొనసాగుతూ వచ్చాయి.

కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చరణ్‌జిత్ సింగ్‌నే సీఎంగా ప్రకటించాలని ముందుగానే భీష్మించుకుంది. అందుకే ఆయనను రెండు స్థానాల నుంచీ పోటీకి దింపింది. చామ్‌కౌర్ సాహిబ్, బదౌర్‌ల నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఈ రెండు స్థానాల్లోనూ ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాజీనామాకు సిద్ధం అయినట్టు తెలుస్తున్నది.

నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల మ‌ధ్య పోరు హోరాహోరీగా ఉంటుంద‌ని భావించారు. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ అధిక్యం లో దూసుకుపోతోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల కౌంటింగ్ గ‌మ‌నిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజ‌యం దిశ‌గా ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే మ్యాజిక్ ఫిగ‌ర్ దాటూతూ.. ఏకంగా 100 స్థానాల అధిక్యం దిశ‌గా ముందుకు సాగుతోంది. దీంతో మ‌రో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం ఏర్పాటు సంకేతాలు పంపింది. 

ఇప్ప‌టివ‌ర‌కు పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు సంబంధించి అందిన వివ‌రాల గ‌మనిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో అధిక్యం కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ 18 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఏస్ఏడీ కూట‌మి 7 స్థానాల్లో అధిక్యంలో ఉండ‌గా, బీజేపీ కూట‌మి 4 స్థానాల్లో మాత్ర‌మే ముంద‌జ‌ల్లో ఉంది.
పంజాబ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ ట్రెండ్‌లు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముందంజలో ఉంచుతూ.. ట్రెంగ్ క‌నిపింది. ఈ క్ర‌మంలోనే పంజాబ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభ పోకడలు ముందుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తిరుగులేని ఆధిక్యాన్ని కనబరుస్తోంది. హోరాహోరీగా సాగిన బహుళ మూలల పోరులో కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోయింది.