టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు: 15 మంది మృతి, అగ్నికీలల్లో 50 మంది
పంజాబ్ రాష్ట్రంలోని ఓ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది మృత్యువాత పడ్డారు.
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ టపాసుల ఫ్యాక్టరీలో బుధవారం నాడు చోటు చేసుకొన్న పేలుడులో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. ఘటన స్థలంలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నివాస ప్రాంతాల మధ్య ఉందని బోర్డర్ రేంజ్ ఐజీ పర్మార్ తెలిపారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను చేపట్టారు. పేలుడు సంబవించిన సమయంలో తొమ్మిది మంది మృతి చెందారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఉన్న సుమారు 50మందికిపైగా ఈ మంటల్లో చిక్కుకొన్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.