త్వరలో పెళ్లి.. ప్రేయసి మాట్లాడటం లేదని..లాయర్ ఆత్మహత్య
సురేష్ గురువారం రాత్రి ప్రియురాలికి వీడియో కాల్ చేసి, నువ్వు నాతో మాట్లాడడం మానివేసినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ, ఆమె చూస్తుండగానే కుర్చీపై నిల్చుని తాడు బిగించుకుని సెల్ఫోన్ కట్ చేశాడు.
వారు ఇద్దరు ఒకరిని మరొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఈ నెల 27వ తేదీన వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. అంతలోనే ఘోరం జరిగిపోయింది. తాను ప్రేమించిన ప్రియురాలు తనతో మాట్లాడటం లేదని... అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే....కనకచెట్టిట కుళం ప్రాంతానికి చెందిన సురేష్(31) న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. పుదుచ్చేరి లా కాలేజీలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ప్రేమించాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించడంతో... కొన్నాళ్లపాటు వారి ప్రేమాయణం కొనసాగించారు. పెళ్లి చేసుకోవాలని భావించిన తర్వాత ఈ విషయం పెద్దలకు తెలియజేశారు.
పెద్దలు కూడా అంగీకరించడంతో... ఈ నెల 27వ తేదీన పెళ్లి చేయడానికి పెద్దలు అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా... కొద్ది రోజుల క్రితం ఇద్దరికీ ఏదో విషయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో.. యువతి అతనితో మాట్లాడటం మానేసింది.. బుజ్జగించేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో... ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు దూరమైందనే బాధ అతనిలో మొదలైంది. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
సురేష్ గురువారం రాత్రి ప్రియురాలికి వీడియో కాల్ చేసి, నువ్వు నాతో మాట్లాడడం మానివేసినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతూ, ఆమె చూస్తుండగానే కుర్చీపై నిల్చుని తాడు బిగించుకుని సెల్ఫోన్ కట్ చేశాడు.
సరదాగా ఈ చేష్టలకు పాల్పడుతున్నాడని తేలిగ్గా తీసిపారేసిన సదరు యువతి, కొద్ది సేపటి తర్వాత అనుమానంతో సురేష్ ఇంటికి సమీపంలో నివసించే శివశక్తి అనే వ్యక్తికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. శివశక్తి వెంటనే సురేష్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలపగా, ఆందోళన చెందుతూ తలుపుతట్టారు.
అయితే ఎంతకూ తలుపులు తెరుచుకోకపోవడంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించగా, సురేష్ ఉరికి వేలాడుతున్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈలోగా కడలూరులో ఉంటున్న సదరు యువతి కూడా పుదుచ్చేరికి చేరుకోగా, పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రియురాలు మాట్లాడకపోవడమే ఆత్మహత్యకు కారణమా, మరేదైనా ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు